TGSRTC AC Bus Charges : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే సిటీ బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులకు ఊరట కలిగిస్తూ ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రవేశపెట్టిన మూడు నెలల ‘సమ్మర్ డిస్కౌంట్’ (Summer Discount) ఆఫర్ మే 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో జూన్ 1, 2026 (సోమవారం) నుంచి ఆయా బస్సుల్లో పాత (సాధారణ) చార్జీలను పునరుద్ధరించనున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

నగరంలో పీక్ సమ్మర్ (వేసవి కాలం) లో సాధారణ ప్రజలకు కూడా ఏసీ ప్రయాణాన్ని అందుబాటు ధరల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో టీజీఎస్ఆర్టీసీ ఈ ప్రత్యేక రాయితీని అందుబాటులోకి తీసుకువచ్చింది. మూడు నెలల పాటు కొనసాగిన ఈ ఆఫర్…. గ్రేటర్ పరిధిలో నడిచే మెట్రో డీలక్స్ (Metro Deluxe), ఈ-మెట్రో ఏసీ (e-Metro AC) బస్సులకు వర్తింపజేశారు.
చార్జీల పెంపు కాదు: ఆర్టీసీ క్లారిటీ
చార్జీల పునరుద్ధరణపై ప్రయాణికుల్లో ఎలాంటి గందరగోళం నెలకొనకుండా ఉండేందుకు ఆర్టీసీ యాజమాన్యం ముందుగానే ఒక ప్రకటనలో స్పష్టతనిచ్చింది. జూన్ 1 నుంచి చార్జీలు పెరగడం అంటే.. కొత్తగా బస్సు చార్జీలను పెంచడం (Fare Hike) కాదని అధికారులు తెలిపారు. వేసవి కాలం కోసం ప్రత్యేకంగా ఇచ్చిన తాత్కాలిక రాయితీ గడువు మాత్రమే ముగుస్తోందని…. బస్సుల బేస్ ధరలలో (Base Prices) ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న ధరలనే పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ మూడు నెలల కాలంలో సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్ను సద్వినియోగం చేసుకుని, సంస్థ ఆదరణకు తోడ్పడిన నగర ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. జూన్ 1 నుంచి ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారు ఈ మార్పును గమనించాలని…. కండక్టర్లతో అనవసర వాదనలకు దిగకుండా సహకరించాలని ఆర్టీసీ అధికారులు కోరారు.