Nalgonda Cylinder Blast : నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో విషాద ఘటన వెలుగుచూసింది. ఒకే ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ వృద్ధురాలితో పాటు ఆమె ఇద్దరు మైనర్ మనవళ్లు ఉన్నారు.
ముగ్గురు సజీవదహనం…

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడలోని ఒక చిన్న రెండు గదుల ఇంట్లో చంద్రమ్మ (50) అనే మహిళ తన మనవడు లక్ష్మణ్ (17), మనవరాలు ప్రణతి (14)లతో కలిసి నివసిస్తోంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత…. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లోని వంటగ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది.
అర్ధరాత్రి వేళ ప్రమాదం జరగడం…. ఇల్లు చిన్నది కావడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. నిద్రలోనే మంటల మధ్య చిక్కుకుపోవడంతో ముగ్గురూ బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. తీవ్రమైన అగ్నికీలలకు చంద్రమ్మ, లక్ష్మణ్, ప్రణతి అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో శుక్రవారం తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
పిల్లల తండ్రి గతంలోనే మరణించగా…. తల్లి ఉపాధి వెతుక్కుంటూ వేరే ప్రాంతానికి వలస వెళ్ళింది. అప్పటి నుంచి నానమ్మ చంద్రమ్మే ఆ ఇద్దరు పిల్లలను చేరదీసి సాకుతోంది. ఇంతలోనే కాలం రూపంలో వచ్చిన ప్రమాదం ఆ ముగ్గురిని బలితీసుకుంది.
గ్యాస్ సిలిండర్ పేలడానికి గల ఖచ్చితమైన కారణాలు వెంటనే తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీ వల్ల ఈ ప్రమాదం జరిగిందా..? లేదా షార్ట్ సర్క్యూట్ కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.