...
...
Next Story

Traffic Restrictions : రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - ప్రత్యామ్నాయ మార్గాలు, రూట్ మ్యాప్ వివరాలు

Traffic Restrictions Secunderabad : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని పోలీసులు ప్రకటించారు.

Published on: Jun 1, 2026, 15:20:25 IST
Advertisement

Traffic Restrictions Secunderabad : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జూన్ 2వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అధికారిక వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో, అక్కడికి దారితీసే అన్ని ప్రధాన రహదారుల్లో ఉదయం నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు
ట్రాఫిక్ ఆంక్షలు

శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జూన్ 2న ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు సికింద్రాబాద్ ఏరియాలో విస్తృతమైన ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తున్నట్లు మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.

ట్రాఫిక్ మళ్లింపుల వివరాలు ఇవే

పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లే సాధారణ వాహనదారుల కోసం ట్రాఫిక్ పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.

  • బేగంపేట్ నుంచి సంగీత్ జంక్షన్ వైపు (మరియు తిరుగు ప్రయాణం): సిటిఓ (CTO) జంక్షన్ వద్ద ట్రాఫిక్ మళ్లిస్తారు. ఈ మార్గంలో వెళ్లే వారు పారడైజ్ – పాట్నీ – క్లాక్ టవర్ – సంగీత్ జంక్షన్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.
  • బేగంపేట్ నుండి తిరుమలగిరి వైపు (మరియు తిరుగు ప్రయాణం): ఈ రూట్లో వెళ్లే వారు అన్ని ఫ్లైఓవర్లను ఉపయోగించుకుంటూ.. సెయింట్ జాన్స్ రోటరీ – షెనాయ్ – ఏఓసీ (AOC) – కేవీ (KV) – తిరుమలగిరి మీదుగా వెళ్లాలి.
  • సంగీత్ జంక్షన్ నుండి పంజాగుట్ట వైపు : సంగీత్ జంక్షన్ వద్ద వాహనాలను మళ్లిస్తారు. ప్రయాణికులు క్లాక్ టవర్ – పాట్నీ – ఘాస్మండి – కర్బలా – ట్యాంక్ బండ్ – ఖైరతాబాద్ మీదుగా పంజాగుట్ట చేరుకోవాలి.
  • సికింద్రాబాద్ నుండి తిరుమలగిరి వైపు (మరియు తిరుగు ప్రయాణం) : క్లాక్ టవర్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. వాహనదారులు క్లాక్ టవర్ – సంగీత్ – సెయింట్ జాన్స్ రోటరీ – షెనాయ్ – ఏఓసీ (AOC) – కేవీ (KV) – తిరుమలగిరి మార్గంలో వెళ్లాలి.
  • సికింద్రాబాద్ నుండి బోయిన్‌పల్లి వైపు (మరియు తిరుగు ప్రయాణం) : క్లాక్ టవర్ వద్ద మళ్లింపు ఉంటుంది. వాహనదారులు క్లాక్ టవర్ – పాట్నీ – పారడైజ్ – సిటిఓ (CTO) – బోయిన్‌పల్లి రూట్ ఎంచుకోవాలి.
  • బోయిన్‌పల్లి నుండి సికింద్రాబాద్ వైపు: ఈ మార్గంలో వచ్చే వారు బ్రూక్‌బాండ్ – తివోలి – స్వీకార్ ఉపకార్ – వైఎమ్‌సిఏ (YMCA) – సికింద్రాబాద్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.
  • ట్యాంక్ బండ్ నుండి తిరుమలగిరి వైపు : వాహనదారులు పారడైజ్ – సిటిఓ (CTO) – తడ్‌బండ్ – డైమండ్ పాయింట్ – బోయిన్‌పల్లి మార్కెట్ – తిరుమలగిరి మీదుగా వెళ్లాలి.
  • తిరుమలగిరి నుంచి ట్యాంక్ బండ్ వైపు : వైఎమ్‌సిఏ (YMCA) వద్ద మళ్లింపు ఉంటుంది. వాహనదారులు ఎన్‌సిసి (NCC) – పికెట్ – స్వీకార్ ఉపకార్ – వైఎమ్‌సిఏ (YMCA) – క్లాక్ టవర్ – పాట్నీ – ఘాస్మండి – కర్బలా – ట్యాంక్ బండ్ రూట్ లో వెళ్లాలి.

ట్రాఫిక్ నిబంధనల ప్రకారం.. జూన్ 2న ఉదయం 6:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించరు. ఈ సమయాల్లో ప్రత్యామ్నాయ రూట్లలో బస్సులను మళ్లిస్తారు. అదేవిధంగా…. వేడుకలు జరిగే రోడ్ల పక్కన ఎలాంటి వాహనాలను పార్క్ చేయకూడదు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై పార్కింగ్ చేస్తే టోయింగ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఈ ఆంక్షల సమయంలో అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని…. వేడుకలు ముగిసిన వెంటనే ట్రాఫిక్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వేడుకలకు వచ్చేవారి కోసం ప్రత్యేకంగా నాలుగు పార్కింగ్ స్థలాలను కేటాయించారు.

వాహనదారులు సులభంగా నావిగేట్ చేసుకోవడానికి వీలుగా క్యూఆర్ (QR) కోడ్‌లను కూడా అందుబాటులో ఉంచారు. సోషల్ మీడియా వేదికలు, ఎఫ్ఎమ్ (FM) రేడియో ద్వారా ఎప్పటికప్పుడు లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్లను చేరవేస్తామని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే సహాయం కోసం మల్కాజ్‌గిరి ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 8712662999 ను సంప్రదించవచ్చు. వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe