Food adulteration in Hyderabad : భాగ్యనగరంలో ఆహార ప్రియుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ కొందరు కేటుగాళ్లు బాగోతానికి తెరలేపారు. నగరంలోని పలు హోటళ్లకు మటన్ (మేక మాంసం) అని నమ్మిస్తూ, దానికి బదులుగా బీఫ్ను సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) క్రైమ్ టీమ్, హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) సంయుక్తంగా ఈ ముఠాను గుట్టురట్టు చేశాయి.
వెలుగులోకి కీలక విషయాలు…

హైదరాబాద్ పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు…. జూలై 1వ తేదీన నిందితులను అడ్డుకుని తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో భాగంగా అధికారులు దాదాపు 50 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసంలో మటన్తో పాటు బీఫ్ను భారీగా మిక్స్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పట్టుబడిన ఇద్దరు నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం సీసీఎస్ బృందం హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్కు అప్పగించింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు…. ఈ కల్తీ మాంసం సరఫరా నెట్వర్క్ ఎంతవరకు విస్తరించింది? నగరంలో ఏ ఏ హోటళ్లకు, రెస్టారెంట్లకు దీనిని సరఫరా చేశారు…? అనే కోణంలో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. నిర్దిష్టమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే ఈ మెరుపు దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదిలావుండగా నగరంలో ఇటీవల కాలంలో ఆహార కల్తీపై నిఘా విభాగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అంతకుముందు జూన్ 19న చార్మినార్ ప్రాంతంలోని హుస్సేనిఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నడుస్తున్న ఒక ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారితో కలిసి ఆకస్మిక దాడి చేసింది. పంచ్ మొహల్లాలోని న్యూ లాడ్ బజార్లో ఉన్న 'అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్' ప్రాంగణాన్ని తనిఖీ చేయగా, అక్కడ అత్యంత ఘోరమైన, అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించేలా ఉందని అధికారులు పేర్కొన్నారు. నగరంలో హోటల్ ఆహార నాణ్యతపై వరుసగా వెలుగుచూస్తున్న ఈ ఘటనలు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.