కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టెన్త్ విద్యార్థులకు కేంద్రమంత్రి, స్థానిక ఎంపీగా ఉన్న బండి సంజయ్ మరోసారి తీపి కబురు చెప్పారు. ఇప్పటికే మోదీ కానుక పేరుతో పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను కూడా పంపిణీ చేయగా… ఈసారి వార్షిక ఎగ్జామ్ ఫీజును చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల ఫీజు భారం కారాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బండి సంజయ్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. వారి ఉజ్వల భవిష్యత్తు కోసం తన వంతుగా ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల ఫీజును తన వేతనం నుంచి చెల్లిస్తానని పేర్కొన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 12,292 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్నారు. వీరందరి వార్షిక ఫీజును తానే చెల్లిస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించారు.
- కరీంనగర్ జిల్లా – 4,847 మంది విద్యార్థులు
- సిరిసిల్ల జిల్లా – 4,059 మంది
- సిద్ధిపేట జిల్లా – 1,118 మంది
- జగిత్యాల జిల్లా – 1,135 మంది
- హన్మకొండ జిల్లా – 1,133 మంది
ఈ విద్యార్థులందరి పరీక్ష ఫీజుల కోసం సుమారు రూ. 15 లక్షలు అవసరమవుతాయి. ఈ మొత్తాన్ని తన వేతనం జీతం భరించాలనే నిర్ణయం తీసుకున్నానని బండి సంజయ్ వెల్లడించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన లేఖలను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించాననని తెలిపారు.