TG MBBS BDS Admissions 2026 : ఎంబీబీఎస్ ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ షురూ - నేటి నుంచే రిజిస్ట్రేషన్లు, ముఖ్య సమాచారం
TG MBBS BDS Admissions 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి ఆగస్ట్ 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో ప్రవేశాలకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా నీట్ యూజీ (NEET UG-2026) అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు…
అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టి నుంచే తమ వివరాలను నమోదు చేసుకోవడం ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించారు.
అభ్యర్థులు ప్రవేశాలకు సంబంధించి అధికారిక పోర్టల్ https://tsmedadm.tsche.in ను సందర్శించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను భర్తీ చేయడంతో పాటు విద్యార్థులు విద్యా అర్హతల సర్టిఫికెట్లు, రిజర్వేషన్ పత్రాలు, స్థానికత, నీట్ ర్యాంక్ కార్డు, ఇతర అవసరమైన ధ్రువపత్రాల ఒరిజినల్ స్క్రాన్డ్ ప్రతులను పోర్టల్లో అప్లోడ్ చేయాలి.
అభ్యర్థులు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల అప్లోడ్ ప్రక్రియను ఒకే ఒక్కసారి మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. తదుపరి కౌన్సెలింగ్ రౌండ్లలో మళ్లీ కొత్తగా సర్టిఫికెట్లను అప్లోడ్ చేసే అవకాశం ఉండదని, కాబట్టి దరఖాస్తు సమయంలోనే అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించుకుని సమర్పించాలని హెచ్చరించారు.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన వెంటనే విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల కమిటీ విద్యార్థులు సమర్పించిన సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ధ్రువపత్రాల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత… అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలతో కూడిన తాత్కాలిక మెరిట్ జాబితాను అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు.
వెబ్ ఆప్షన్లు.. సీట్ల కేటాయింపు
తాత్కాలిక మెరిట్ జాబితా వెల్లడైన అనంతరం వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ, కళాశాలల వారీగా లభ్యమయ్యే సీట్ల మ్యాట్రిక్స్, పూర్తిస్థాయి కౌన్సెలింగ్ షెడ్యూల్ను విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా ప్రకటించనుంది. వెబ్ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో విద్యార్థులు తమకు ఇష్టమైన కళాశాలల ప్రాధాన్యత క్రమాన్ని అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని,,,, ఆప్షన్ల దాఖలులో పొరపాట్లు దొర్లకుండా చూసుకోవాలని హెల్త్ యూనివర్సిటీ నిపుణులు సూచించారు.
కటాఫ్ మార్కులు ఇలా…
2026-27 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఖరారు చేసిన అర్హత కటాఫ్ మార్కులు, పెర్సంటైల్ వివరాలను కూడా కాళోజో ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.
- జనరల్ / ఇడబ్ల్యూఎస్ (UR/EWS ): 50వ పెర్సంటైల్ — కటాఫ్ స్కోరు 715 నుంచి 213 మార్కులు.
- ఓబీసీ (OBC) : 40వ పర్సంటైల్ — కటాఫ్ స్కోరు 212 నుండి 177 మార్కులు.
- ఎస్సీ (SC) : 40వ పర్సంటైల్ — కటాఫ్ స్కోరు 212 నుండి 177 మార్కులు.
- ఎస్టీ (ST): 40వ పర్సంటైల్ — కటాఫ్ స్కోరు 212 నుండి 177 మార్కులు.
- జనరల్ / ఇడబ్ల్యూఎస్ డిసేబుల్డ్ (UR/EWS & PWD) : 45వ పర్సంటైల్ — కటాఫ్ స్కోరు 212 నుండి 194 మార్కులు.
- ఓబీసీ డిసేబుల్డ్ (OBC - PWD): 40వ పర్సంటైల్ — కటాఫ్ స్కోరు 193 నుండి 177 మార్కులు.
- ఎస్సీ డిసేబుల్డ్ (SC - PWD): 40వ పర్సంటైల్ — కటాఫ్ స్కోరు 193 నుండి 177 మార్కులు.
- ఎస్టీ డిసేబుల్డ్ (ST - PWD): 40వ పర్సంటైల్ — కటాఫ్ స్కోరు 191 నుండి 177 మార్కులు.
విద్యార్థులు ప్రవేశాలకు సంబంధించిన తదుపరి సమాచారం, తాజా వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ ( https://www.knruhs.telangana.gov.in/ ) ను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

