హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంపు
హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి ఇది వర్తించనుంది.
విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఇస్తున్న డైట్ ఛార్జీల్లో 10 శాతం పెంచాలని ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్ష సందర్భంగా విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినా... ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపజేయాలని సీఎం స్పష్టం చేశారు. బలహీనవర్గాల విద్యార్థుల కోసం డైట్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..'బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుంది. దీనికి తగినట్టుగానే వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలి. మెరుగైన విద్య, మౌళిక సదుపాయాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకే డైట్ ఛార్జీలు పెంచుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు లబ్ది చేకూర్చే విషయంలో వారికి కలిగే ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.' అని సీఎం చంద్రబాబు అన్నారు.
సంక్షేమ శాఖలకు చెందిన విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దాలని వ్యాఖ్యానించారు. 'హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలి. రెసిడెన్షియల్ స్కూళ్లల్లో నెట్జీరో విధానాన్ని అమలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో విశ్లేషించాలి. బయో డైవర్శిటీ పార్కుల తరహాలో గురుకులాలను నిర్వహించాలి. మెరుగైన వసతులు, మౌళిక సదుపాయాలతో గురుకులాలను నిర్మిద్దాం. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల మెయింటెనెన్స్ గ్రాంట్ ఇవ్వాలి. దీని నిమిత్తం రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం.' అని చంద్రబాబు అన్నారు.
హాస్టళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులను ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇప్పించాలన్నారు. పోటీ పరీక్షలకు గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. విద్యతో సమానంగా శిక్షణ అందించాలన్నారు. బెస్ట్ టీచర్స్ నియమించి క్వాలిటీ ట్రైనింగివ్వాలన్నారు చంద్రబాబు. హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనబరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు.
సంక్షేమ హాస్టళ్లను ఎన్ఆర్ఐలు అడాప్ట్ చేసుకునేలా వారితో సంప్రదింపులు జరపాలని చంద్రబాబు అన్నారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల నెట్ వర్కింగ్ చేయాలన్నారు. రెసిడెన్షిల్ స్కూళ్లు, గురుకులాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విద్యా, వైద్య సేవలు అందించే వాళ్లకి అవకాశం కల్పించాలన్నారు.
జీ రామ్ జీ ద్వారా అంగన్వాడీ భవనాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. ఈ సమీక్ష సందర్భంగా సంక్షేమ శాఖల్లో తాము తీసుకున్న చర్యలను మంత్రులు, అధికారులు వివరించారు. కొందరు విద్యార్థులు హోం సిక్కు గురవుతున్నారని.. అలాంటి విద్యార్థుల కోసం తల్లిదండ్రులతో మాట్లాడేలా స్మార్ట్ కార్డ్ బేస్డ్ టెలీఫోన్ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. తల్లిదండ్రులతో రోజులో 4 నిమిషాలు మాట్లాడుకునే సదుపాయం కల్పించామని తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


