AP Teachers : ఫిన్లాండ్ పర్యటనకు ఏపీ ఉత్తమ టీచర్లు - బోధనా పద్ధతులపై స్పెషల్ ట్రైనింగ్..!

AP Teachers Finland Tour : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులు ఫిన్‌లాండ్ పర్యటనకు శనివారం బయలుదేరనున్నారు. అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులపై వీరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

Published on: Aug 15, 2026, 16:02:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Teachers Finland Tour : ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుత సేవలు అందించి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 29 మంది ఉపాధ్యాయులను అంతర్జాతీయ వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమం (International Professional Development Programme) కోసం శనివారం ఫిన్‌లాండ్‌కు పంపుతోంది.

ఏపీ నుంచి ఫిన్‌లాండ్‌కు 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులు
ఏపీ నుంచి ఫిన్‌లాండ్‌కు 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులు

ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ బోధనా పద్ధతులకు పేరుగాంచిన ఫిన్‌లాండ్ విద్యా విధానాన్ని నేరుగా అధ్యయనం చేసేందుకు, ఆధునిక బోధనా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ పర్యటన ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడనుంది.

ఫిన్‌లాండ్‌లోని ప్రముఖ 'యూనివర్సిటీ ఆఫ్ తుర్కు' (University of Turku) తో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా మన ఉపాధ్యాయులు తుర్కు , రౌమా (Rauma) ప్రాంతాలను సందర్శిస్తారు.

అక్కడ ఉన్న ప్రాథమిక విద్యా కేంద్రాలు (Early Childhood Education Centres), ఉపాధ్యాయ శిక్షణా పాఠశాలలను పరిశీలించి, అక్కడి తరగతి గదుల్లో బోధనా విధానాలను నేరుగా గమనిస్తారు. విదేశీ విద్యావేత్తలతో ముఖాముఖి చర్చలు జరిపి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటారు.

శిక్షణ ప్రధాన ఉద్దేశాలు:

  • ప్రాథమిక విద్యలో పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా బోధించే విధానాలపై పట్టు సాధించడం.
  • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ సాధనాలను తరగతి గది బోధనలో సమర్థవంతంగా ఉపయోగించడం.
  • ఉపాధ్యాయుల్లో పాఠశాల నిర్వహణ, మార్గదర్శకత్వ నైపుణ్యాలను పెంచడం.
  • విద్యార్థుల మానసిక వికాసం, ఆరోగ్యం మరియు ఆనందకర వాతావరణంలో విద్యనభ్యసించేలా పాఠశాల సంస్కృతిని తీర్చిదిద్దడం.

ఫిన్లాండ్ విద్యా విధానం నుంచి నేర్చుకున్న విషయాల ఆధారంగా ఉపాధ్యాయులు తమ సొంత పాఠశాలలకు ఉపయోగపడే ప్రత్యేక ప్రాజెక్టులను రూపొందిస్తారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వాటిని తమ పాఠశాలల్లో అమలు చేస్తారు. అంతేకాకుండా…. ఈ 29 మంది ఉపాధ్యాయులు జిల్లా, మండల స్థాయిల్లోని తోటి ఉపాధ్యాయులకు రిసోర్స్ పర్సన్లుగా, మెంటార్లుగా వ్యవహరిస్తారు. ఫిన్‌లాండ్‌లోని ఉత్తమ అంశాలను మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మార్చి ఇతర ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను కొనియాడారు. "మన సమాజానికి బలమైన పునాది ఉపాధ్యాయులే. మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పాలు వారు. కేవలం విద్యార్థుల భవిష్యత్తునే కాకుండా, మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే శక్తి ఉపాధ్యాయులకు ఉంది" అని పేర్కొన్నారు.

"మన ఉపాధ్యాయులకు సరైన జ్ఞానం, అధునాతన నైపుణ్యాలు మరియు అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందించడం ఎంతో అత్యవసరం. ఈ అంతర్జాతీయ శిక్షణా అవకాశం ద్వారా మన ఉపాధ్యాయులు ఫిన్‌లాండ్ నుంచి కొత్త ఆలోచనలు, అత్యుత్తమ బోధనా పద్ధతులను నేర్చుకుని వచ్చి, మన ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో అమలు చేస్తారని ఆశిస్తున్నాను" అని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More