Vietnam Boat Tragedy : వియత్నాం బోటు ప్రమాదం - ముగ్గురు ఏపీ వాసులు మృతి..!

వియత్నాంలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన విహారయాత్రలో జరిగిన ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Published on: Jul 12, 2026, 06:59:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వియత్నాంలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. మరో వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 15 నుంచి 16 మంది భారతీయులు మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదం - సహాయక చర్యలు (Vietnam News Agency X/ANI Video Grab) (Vietnam News Agency)
వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదం - సహాయక చర్యలు (Vietnam News Agency X/ANI Video Grab) (Vietnam News Agency)

వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయుల బృందం ఈ ప్రమాదానికి గురైంది. ఒక మొబైల్ ట్రేడింగ్ కంపెనీ స్పాన్సర్ చేసిన ఈ విహారయాత్రలో భాగంగా పర్యాటకులు ఒక దీవిని సందర్శించేందుకు వెళ్లారు. అయితే…. వాతావరణం అనుకూలించకపోవడం, అదే సమయంలో బోటుకు సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు.

"ఒక బాధాకరమైన ఘటన వియత్నాంలో జరిగింది. ఒక మొబైల్ ట్రేడింగ్ సంస్థ పంపిన పర్యటనలో భాగంగా భారత దేశం నుంచి చాలా మంది పర్యాటకులు వియత్నాం వెళ్లారు. వారు ఒక ద్వీపాన్ని సందర్శించే క్రమంలో వాతావరణం క్షీణించి, బోటులో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ప్రమాదం జరిగింది," అని మంత్రి శ్రీనివాస్ వివరించారు.

ప్రమాదం జరిగిన సమయంలో బోటులో సుమారు 250 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అందులో పలువురు నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో సుమారు 15 నుంచి 16 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, ఇది అత్యంత విచారకరమని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దాదాపు 33 మంది ఈ పర్యటనలో ఉండగా…. వారిలో ముగ్గురు మృతి చెందారని, మరొకరు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.

ప్రభుత్వ స్పందన

ప్రమాదం గురించి వార్తలు తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, "నారా లోకేశ్ ఈ ఘటనపై వెంటనే స్పందించారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి సమాచారం అందించారు. దీనిపై భారత ఎంబసీ, వియత్నాం ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు" అని చెప్పారు.

వియత్నాం అధికారులు కూడా ఈ ప్రమాదంపై చాలా వేగంగా స్పందించారని మంత్రి ప్రశంసించారు. వారు వెంటనే సహాయక బృందాలను రంగంలోకి దించి, భారతీయ పర్యాటకులను కాపాడేందుకు ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి…. ప్రమాదం నుంచి బయటపడిన వారిని, మరణించిన వారి భౌతిక కాయాలను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని హామీ ఇచ్చారు.

భారత్ నుంచి వియత్నాం వెళ్లిన పర్యాటకుల బృందంలో ఇంకా ఎంతమంది క్షేమంగా ఉన్నారు, వారిని ఎలా తరలించాలనే అంశాలపై భారత రాయబార కార్యాలయం వియత్నాం అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వనుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More