AICTE Engineering Colleges Closed : దేశవ్యాప్తంగా 58 ఇంజినీరింగ్ కాలేజీల మూసివేత - తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..?
AICTE Engineering Colleges Closed : దేశవ్యాప్తంగా 2025-26 విద్యాసంవత్సరంలో 58 ఇంజినీరింగ్, సాంకేతిక విద్యాసంస్థలు మూతపడ్డాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఉండగా… తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కాలేజీలు ఉన్నట్లు ఏఐసీటీఈ వెల్లడించింది.
AICTE Engineering Colleges Closed : దేశంలో ఇంజినీరింగ్, సాంకేతిక విద్యా రంగానికి సంబంధించి ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) కీలక విషయాలను వెల్లడించింది. 2025-26 విద్యాసంవత్సరంలో దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్, టెక్నికల్ కాలేజీలు మూతపడ్డాయి. విద్యార్థుల సంఖ్య తగ్గడం, మౌలిక వసతుల లేమి, నిబంధనల ఉల్లంఘన వంటి వివిధ కారణాల వల్ల ఈ విద్యాసంస్థలను మూసివేయాల్సి వచ్చినట్లు ఏఐసీటీఈ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఈ విద్యాసంస్థల మూసివేత 'ప్రోగ్రెసివ్ క్లోజర్' (క్రమంగా మూసివేసే) పద్ధతిలో జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రకారం…. సదరు కాలేజీలు ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి మొదటి సంవత్సరంలో కొత్తగా ఎలాంటి అడ్మిషన్లు తీసుకోకూడదు. కానీ, ఇప్పటికే ఆయా కాలేజీల్లో చదువుతున్న పాత విద్యార్థులు తమ డిగ్రీలను ఎలాంటి అభ్యంతరం లేకుండా పూర్తి చేసుకునేందుకు అనుమతిస్తారు. భారతదేశంలో సాంకేతిక విద్య ప్రమాణాలను నియంత్రించే అత్యున్నత సంస్థ అయిన ఏఐసీటీఈ…. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మేనేజ్మెంట్, ఫార్మసీ కోర్సులను పర్యవేక్షిస్తుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ కాలేజీల మూసివేత:
ఈ(2025-26) విద్యాసంవత్సరంలో మూతపడిన 58 విద్యాసంస్థల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి 12 చొప్పున కాలేజీలు ఉన్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో 8 విద్యాసంస్థలు మూతపడ్డాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే…. తెలంగాణలో 4 ఇంజినీరింగ్ కాలేజీలు, ఆంధ్రప్రదేశ్లో 3 కాలేజీలు మూసివేతకు గురయ్యాయి.
మిగిలిన రాష్ట్రాల వివరాలు:
- పంజాబ్: 4 కాలేజీలు
- రాజస్థాన్: 3 కాలేజీలు
- గుజరాత్, కర్ణాటక, పుణె, తమిళనాడు: రెండేసి చొప్పున కాలేజీలు
- హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్: ఒక్కో కాలేజీ చొప్పున మూతపడ్డాయి.
ఈ 58 విద్యాసంస్థలలో కేవలం 3 కాలేజీలు మాత్రమే ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థలు కాగా…. మిగిలినవన్నీ ప్రైవేట్ యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్నవే కావడం గమనార్హం. కేవలం కాలేజీలే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సాంకేతిక, ఇంజనీరింగ్ కాలేజీల్లో డిమాండ్ లేని దాదాపు 950 కి పైగా కోర్సులను కూడా ఈ కాలంలో పూర్తిగా నిలిపివేసినట్లు ఏఐసీటీఈ అధికారి వెల్లడించారు.
మూసివేతకు ప్రధాన కారణాలు….
విద్యార్థుల అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం ప్రధాన కారణం. అంతేకాకుండా నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీని (బోధనా సిబ్బందిని) కొనసాగించలేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత మరియు కార్యాచరణ నిబంధనలను పాటించకపోవడం వంటి కారణాల వల్లే ఏఐసీటీఈ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఏఐసీటీఈ రెండు పద్ధతుల్లో కాలేజీలను మూసివేస్తుంది. మొదటిది 'ప్రోగ్రెసివ్ క్లోజర్' - ఇందులో పాత విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా కోర్సులు పూర్తయ్యాక కాలేజీని మూసివేస్తారు. రెండోది 'కంప్లీట్ క్లోజర్' - ఇందులో కాలేజీలను తక్షణమే పూర్తిగా మూసివేసి…. అక్కడ చదువుతున్న విద్యార్థులను వేరే కాలేజీలకు బదిలీ చేస్తారు. ప్రస్తుతం మూతపడిన సంస్థలకు ప్రోగ్రెసివ్ క్లోజర్ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

