తిరుమలలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. నీటి నిల్వలకు సంబంధించిన వివరాలను టీటీడీ ఓ ప్రకటన ద్వారా విడుదల చేసింది.

తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. వరదనీటి ప్రవాహంతో మొత్తం ఐదు జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 215 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయని టీటీడీ వెల్లడించింది.
పాపవినాశనం డ్యామ్ నిల్వ సామర్థ్యం 5240.00 లక్షల గ్యాలన్లు కాగా… దాదాపుగా నిండింది. గోగర్భం డ్యామ్ నిండిపోవటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆకాశగంగ డ్యామ్ నిల్వ సామర్థ్యం 685.00 లక్షల గ్యాలన్లుగా ఉండగా… దాదాపుగా నిండుగా ఉంది.
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో తిరుమలలో వారం రోజులుగా ఎడతెరిపి ఇవ్వకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముంపు ముప్పు దృష్ట్యా లోతట్టు ప్రాంతాల గ్రామాలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
ఇవాళ భారీ వర్ష సూచన
ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక సోమ, మంగళవారాల్లో తుపాన్ ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగానికి తుపాను ఎస్వోపి ( స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) అమలుపై సూచనలు ఇచ్చారు. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడనున్నందున నదులు, సముద్ర తీరాల్లో చేపలు పట్టడం, అన్ని బోటింగ్ కార్యకలాపాలు బుధవారం వరకు నిలిపివేయాలని, అలాగే బీచ్లకు పర్యాటకుల ప్రవేశం కుడా నిషేధించాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ అయ్యాయి.