టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు, గోశాల ఆధునికీకరణ - తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం

Anant Ambani donation to TTD : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని అనంత్ అంబానీ దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు, చార్జింగ్ స్టేషన్లతో పాటు వంతారా తరహాలో గోశాల ఆధునికీకరణను ప్రకటిస్తూ భారీ విరాళం ఇచ్చారు.

Published on: Jun 28, 2026, 13:27:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Anant Ambani donation to TTD : ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) భారీ విరాళాలు ప్రకటించారు. శ్రీవారి భక్తులకు సౌకర్యవంతమైన, కాలుష్య రహిత ప్రయాణాన్ని అందించడంతో పాటు ఆధ్యాత్మిక సేవల విస్తరణకు అంబానీ కుటుంబం మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంది.

తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం
తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం

అనంత్ అంబానీ ఇవాళ వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అంతకముందు తిరుమలకు చేరుకున్న అనంత్ అంబానీకి టీటీడీ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ఆలయ నిబంధనల ప్రకారం దర్శన ఏర్పాట్లు చేశారు.

సుప్రభాత సేవ అనంతరం అనంత్ అంబానీ ఆలయంలోని మూలవిరాట్టును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.

తిరుమలకు 25 ఎలక్ట్రిక్ బస్సులు

శ్రీవారి దర్శనం అనంతరం అనంత్ అంబానీ తిరుమల క్షేత్రం కోసం కీలక ప్రకటనలు చేశారు. కొండపై పర్యావరణాన్ని కాపాడేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు టీటీడీకి 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేవలం బస్సులు ఇవ్వడమే కాకుండా, వాటి నిర్వహణ బాధ్యతలను కూడా రిలయన్స్ సంస్థ చూసుకోనుంది.

ఈ బస్సులను నడపడానికి అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను సైతం రిలయన్స్ సంస్థే చెల్లించనుంది. వీటితో పాటు ఈ-బస్సుల ఛార్జింగ్ కోసం తిరుమలలో ఒక అధునాతన ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. దీనివల్ల టీటీడీపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా భక్తులకు ఉచిత, పర్యావరణహిత రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.

గుజరాత్ 'వంతారా' తరహాలో టీటీడీ గోశాల

జంతు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపే అనంత్ అంబానీ, టీటీడీ నిర్వహిస్తున్న గోశాల అభివృద్ధిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఏర్పాటు చేసిన ప్రపంచ స్థాయి జంతు పునరావాస కేంద్రం 'వంతారా' (Vantara) తరహాలోనే తిరుపతిలోని టీటీడీ గోశాలను కూడా పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు ఆయన అంగీకారం తెలిపారు. వంతారాలో జంతువులకు అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలు, పౌష్టికాహారం, సాంకేతికతను ఇక్కడ కూడా ఉపయోగించనున్నారు. శ్రీవారి గోశాలలోని గోవుల సంరక్షణకు, వాటి మౌలిక వసతుల కల్పనకు రిలయన్స్ ఫౌండేషన్ సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందించనుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More