ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.ఈ నెల 28వ తేదీన ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి…. రాజధానిగా అమరావతిని ఖరారు చేయనుంది. న్యాయపరమైన చిక్కులకు ఈ తీర్మానంతో శాశ్వత పరిష్కారం లభించాలని సర్కార్ భావిస్తోంది.
అమరావతిపై తీర్మానం….!

ఏకైక అజెండాతో నిర్వహించే అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర రాజధానిగా అమరావతిపై తీర్మానం చేస్తారు. అంతేకాదు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఫలితంగా రాజధాని మార్పు విషయంలో ఎలాంటి సందిగ్ధత, ప్రయత్నాలు ఉండకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్నది పార్లమెంట్ రికార్డుల్లో స్పష్టంగా ఉండేలా చూడటమే ఏపీ సర్కార్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. తీర్మానం తర్వాత… విభజన చట్టంలో కూడా ఏపీ రాజధాని అమరావతి అనే విషయాన్ని స్పష్టంగా పొందుపర్చిలే సవరణ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఫలితంగా అమరావతికి కేవలం రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా…. దేశ అత్యున్నత చట్టసభ ద్వారా కూడా రాజ్యాంగబద్ధమైన గుర్తింపు దక్కే అవకాశం ఉంటుంది.
మరోవైపు కూటమి ప్రభుత్వం… అమరావతిపై చాలా ఫోకస్ చేస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పనులను వేగవంతం చేస్తోంది. గతంలోని ప్రాజెక్టులను మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులను రాబట్టే పనిలో ఉంది. ఐకానిక్ భవనాలు, రోడ్ల నెట్వర్క్ వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన ముందుకు సాగేందుకు మార్గం సుగమమవుతుంది. సీఎం చంద్రబాబు కూడా… అమరావతి పనులపై నిత్యం పర్యవేక్షిస్తున్నారు.