Nadendla Bhaskara Rao : మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.

Published on: Apr 22, 2026, 13:05:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోసంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం (ఏప్రిల్ 22, 2026) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక శకం ముగిసింది.

నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

రాజకీయ ప్రస్థానం

1935 జూన్ 23న గుంటూరు జిల్లాలో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు వృత్తిరీత్యా న్యాయవాది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన, 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు.

1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు, నాదెండ్ల కీలక పాత్ర పోషించారు. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

ముఖ్యమంత్రిగా 31 రోజులు

తెలుగు రాజకీయ చరిత్రలో నాదెండ్ల భాస్కరరావు పేరు ప్రముఖంగా వినిపించడానికి 1984 నాటి రాజకీయ పరిణామాలు ప్రధాన కారణం. ఎన్టీఆర్ అమెరికాకు వెళ్ళిన సమయంలో నాదెండ్ల తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు సరిగ్గా 31 రోజుల పాటు ఆయన సీఎంగా కొనసాగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.

ముఖ్యమంత్రి పదవి తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు. 2019లో ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరినప్పటికీ, రాజకీయాలకు దాదాపు దూరంగానే ఉంటూ వచ్చారు.

ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (జనసేన పార్టీ) కీలక నేతగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం మంత్రిగా కొనసాగుతున్నారు. భాస్కరరావు మృతి పట్ల ఏపీ సీఎం, తెలంగాణ సీఎంలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి సమయంమలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని, భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. నాదెండ్ల భాస్కరరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More