దయచేసి ఎంటర్ అవ్వకండి.. ఆ విషయంలో తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్ రిక్వెస్ట్!

ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి తమిళనాడుకు చెందిన చేపల వేట పడవలు రావడంపై మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ లేఖ రాశారు. మత్స్య పడవలు మరింతగా ప్రవేశించకుండా నిరోధించడానికి తక్షణ జోక్యం అవసరం అన్నారు.

Published on: Mar 22, 2026, 20:21:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి తమిళనాడుకు చెందిన చేపల వేట పడవలు చొరబడటం, అక్రమంగా చేపలు పట్టడంపై ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తమిళనాడు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్.. ఏపీ ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడు మత్స్య పడవలు మరింతగా ప్రవేశించకుండా నిరోధించడానికి తక్షణ జోక్యం, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తమిళనాడు మత్స్య మరియు మత్స్యకారుల సంక్షేమ డైరెక్టర్‌కు ఒక లేఖ రాశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడుకు చెందిన యంత్ర చేపల పడవల అనధికారిక ప్రవేశం నిరాటంకంగా కొనసాగుతోందని, ఇది స్థానిక మత్స్యకారుల జీవనోపాధి భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా ఉందని ఏపీ లేఖలో పేర్కొంది. రాష్ట్రాల మధ్య అమలులో ఉన్న నియంత్రణ వ్యవస్థను కూడా ఇలా రావడం బలహీనపరుస్తోందని తెలిపింది. తమిళనాడులో యంత్ర పడవల ద్వారా జరిగే అక్రమ చేపల వేట తీవ్రమైన శాంతిభద్రతల ఆందోళనలను కూడా సృష్టించిందని మత్స్యశాఖ కమిషనర్ రాశారు.

తమిళనాడుకు చెందిన పడవల ద్వారా జరుగుతున్న అక్రమ ప్రవేశం, అక్రమ చేపల వేట సమస్యలను పరిష్కరించడానికి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ 2022, 2023, 2025 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా ఇలాంటి లేఖలే రాశారని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ పేర్కొన్నారు.

మార్చి 18న ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన సంఘటనను మత్స్యశాఖ కమిషనర్.. తమిళనాడు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనలో పోలీసుల అదుపులో ఉన్న నాలుగు చేపల పడవలను పుదుచ్చేరికి చెందిన మత్స్యకారులు తీసుకువెళ్లారు. ఈ చర్య శాంతిభద్రతల తీవ్ర ఉల్లంఘన అని, ఇది చట్టాన్ని అమలు చేసే సంస్థల అధికారాన్ని బలహీనపరుస్తుందని చెప్పారు.

'ఈ సంఘటన తిరుపతి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని 162 తీరప్రాంత గ్రామాలకు చెందిన మత్స్యకారులలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. దీనిని వెంటనే పరిష్కరించకపోతే, ఇది రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.' అని మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ లేఖలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాల్లో తమిళనాడు నౌకలు విధ్వంసకరమైన చేపల వేట పద్ధతులను, ముఖ్యంగా ట్రాలింగ్‌ను కొనసాగించడం వల్ల గణనీయమైన పర్యావరణ నష్టం జరుగుతోందని తమిళనాడు అధికారులకు మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ తెలియజేశారు. ఈ కార్యకలాపాల వల్ల తాబేళ్లు, ఇతర అంతరించిపోతున్న సముద్ర జీవుల మరణాలు పెరుగుతున్నాయన్నారు. వాటి కళేబరాలు తరచుగా ఆంధ్రప్రదేశ్ తీరానికి కొట్టుకొస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయని రామ శంకర్ నాయక్ లేఖలో రాశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More