AP Aqua Farmers : రాష్ట్రంలోని ఆక్వా రైతుల పాలిట శాపంగా మారిన రొయ్యల ఫీడ్ ధరల పెంపు నిర్ణయం ఎట్టకేలకు వెనక్కి వెళ్ళింది. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జోక్యంతో…. ఫీడ్ తయారీ కంపెనీలు తాము పెంచాలనుకున్న ధరల నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు అంగీకరించాయి. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఆక్వా రైతులకు పెద్ద ఊరటనిచ్చింది.
ఇటీవలే పెంపు…

ఇటీవల రొయ్యల ఫీడ్ తయారీదారులు కిలోకు రూ.10 వరకు ధర పెంచాలని ఏకపక్షంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు, పెరిగిన సాగు వ్యయంతో ఇబ్బంది పడుతున్న రైతులకు, ఈ పెంపు గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది.
ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫీడ్ తయారీదారుల సంఘం ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు మరియు ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
సమీక్షా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు కంపెనీల తీరుపై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. "రైతుల జీవనోపాధిని దెబ్బతీసేలా తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను ప్రభుత్వం సహించదు. రైతుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రాథమిక లక్ష్యం," అని ఆయన నొక్కి చెప్పారు.
పెంచిన ధరలను తక్షణమే నిలిపివేయాలని ఆయన ఇచ్చిన ఆదేశాలకు తయారీదారులు సానుకూలంగా స్పందించారు. సాగు వ్యయాలను తగ్గించి, రైతులకు లాభదాయకమైన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని… ఆక్వా రంగానికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
పెంచిన ధరల విరమణతో రాష్ట్రంలోని అక్వా రంగం కుదుటపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.