Visakhapatnam CII Summit 2026 : నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - దేశవిదేశాల్లోనూ రోడ్ షోలు..!

Visakhapatnam CII Summit 2026 : విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో ప్రతిష్టాత్మక 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. పెట్టుబడులతో పాటు నాలెడ్జ్ షేరింగ్, ఇన్నోవేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Published on: Jun 30, 2026, 06:02:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Visakhapatnam CII Summit 2026 : రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కురిపించడమే కాకుండా, నూతన ఆలోచనలకు, సాంకేతిక ఆవిష్కరణలకు వేదికగా నిలిచేలా ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సును నిర్వహించడానికి ఏపీ సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సును అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గతానికి భిన్నంగా, సరికొత్త వ్యూహాలతో ఈ సదస్సును విజయవంతం చేయాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సన్నాహక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది సదస్సును "Navigating Change: Leadership, Technology, Trust and Trade in a Transforming World" అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ అంతర్జాతీయ సదస్సులో భాగంగా వివిధ దేశాలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం, మినిస్టీరియల్ సెషన్స్, ప్లీనరీ సమావేశాలు, కంట్రీ సెషన్స్‌తో పాటు బిజినెస్ టు బిజినెస్ (B2B), బిజినెస్ టు గవర్నమెంట్ (B2G) భేటీలు జరిగేలా పక్కా ప్రణాళికలతో ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

5 నగరాల్లో ప్రాంతీయ సదస్సులు….

విశాఖలో జరిగే ప్రధాన సదస్సుకు ముందే రాష్ట్రంలోని ఐదు ప్రముఖ నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ఈ ప్రాంతీయ సదస్సులు జరుగుతాయి. ఆయా ప్రాంతాల్లో ఏయే రంగాల పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన అవకాశాలు ఉన్నాయో ముందుగానే బేరీజు వేసి, దానికి అనుగుణంగా అక్కడికక్కడే ఎంఓయూలు కుదుర్చుకునేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

ఈ సదస్సుపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశంలోని ప్రముఖ నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్‌ లలో భారీ రోడ్ షోలు నిర్వహించనున్నారు. అలాగే విదేశాల్లోనూ రోడ్ షోలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయాలని చంద్రబాబు సూచించారు.

రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ సదస్సులో 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రాంతీయ సదస్సులలో సరికొత్త స్టార్టప్ కంపెనీలకు, సరికొత్త ఆలోచనలతో వచ్చే యువతకు అగ్రతాంబూలం ఇవ్వాలన్నారు. ఈ సదస్సుల్లో నేటి తరం యువత (Gen Z) భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More