AP Drought Mandals : వర్షాభావ పరిస్థితులు - అక్టోబర్ 1న కరువు మండలాల ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 513 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని, అక్టోబర్ 1న అధికారికంగా కరువు మండలాలను ప్రకటిస్తామని చెప్పారు.

Published on: Sep 19, 2026, 19:43:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయ దృక్పథంతో అంచనా వేసి, అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను అధికారికంగా ప్రకటించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావం, కరవు ప్రభావం, వ్యవసాయ మరియు ఉద్యాన పంటల ప్రస్తుత స్థితిగతులు, రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో శనివారం సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంటలను కాపాడేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితులపై ఈ సమీక్షలో క్షుణ్ణంగా చర్చించారు.

అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

513 మండలాల్లో తీవ్ర కరవు ఛాయలు….

రాష్ట్రంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితులపై అధికారులు ప్రాథమిక నివేదికను సీఎంకు అందించారు. దీని ప్రకారం రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలోని 513 మండలాల్లో కరువు తీవ్రత నెలకొందని ప్రాథమికంగా నిర్ధారించారు. క్షేత్రస్థాయి బృందాలు నేరుగా పొలాల్లోకి వెళ్లి పంట నష్టాన్ని పరిశీలిస్తాయని తెలిపారు. ఈ బృందాలు ఈ నెల 24వ తేదీలోగా తమ సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తాయి. అనంతరం సెప్టెంబర్ 29న రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశమై పూర్తిస్థాయి తుది నివేదికను ఖరారు చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా అక్టోబర్ 1న ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.

వర్షాభావం వల్ల దెబ్బతింటున్న ఉద్యాన పంటలను కాపాడుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. "ఉద్యాన పంటలను కాపాడటానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.190 కోట్లు కేటాయించింది. ఈ నిధుల సద్వినియోగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి" అని సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎండిపోతున్న పంటలకు తక్షణమే తడులు అందించేలా క్షేత్రస్థాయి యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఎక్కడా ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా గట్టి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యంగా భూగర్భ జలాలు అడుగంటి, బోర్లపై ఆధారపడే ప్రాంతాలకు అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని చెప్పారు. ఇక విశాఖపట్నం నగరంలో రాబోయే రోజుల్లో ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే పక్కా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో తక్షణమే అత్యవసర సమావేశం నిర్వహించి, విశాఖకు తాగునీటిని అందించేందుకు సంబంధించిన పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More