విశాఖపట్నం వెలంపేట స్లమ్‌ రీ డెవలప్‌మెంట్.. మారనున్న రూపురేఖలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైజాగ్‌లో మురికివాడలను రీడెవలప్‌మెంట్ చేస్తోంది. వెలంపేటను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది.

Published on: Aug 11, 2026, 15:20:05 IST
By , Visakhapatnam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాల్లోని ఇరుకైన, మురికివాడల రూపురేఖలను మార్చేందుకు ఒక సరికొత్త రీడెవలప్‌మెంట్‌ నమూనాకు ఆమోదం తెలిపింది. ముంబైలోని ప్రసిద్ధ ధారావి మోడల్ ఆధారంగా ఈ భారీ పట్టణ పునర్నిర్మాణ ప్రాజెక్టును మొదటగా విశాఖపట్నంలోని వెలంపేట మురికివాడలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది. ఒక అధికారిక ప్రకటనలో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ప్రభుత్వ ఖజానాపై నేరుగా ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, అక్కడే నివసిస్తున్న పేద ప్రజలకు ఆధునిక వసతులతో కూడిన ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ఈ నమూనా ముఖ్య ఉద్దేశం. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కార్యక్రమంలో భాగంగా జోన్-IV, వార్డు నంబర్ 35 పరిధిలోని వేలం పేట స్లమ్‌ను డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ట్రాన్స్‌ఫర్(DBFT) ప్రాతిపదికన అభివృద్ధి చేయడానికి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(GVMC)కి ప్రభుత్వం పూర్తి అనుమతులు మంజూరు చేసింది.

కేవలం 1,986.45 చదరపు మీటర్ల చిన్న స్థలంలో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. దాదాపు 45 మీటర్ల ఎత్తు వరకు ఎత్తైన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తారు. ఈ కాంప్లెక్స్‌లో స్థానిక నివాసితుల కోసం 177 అధునాతన హౌసింగ్ యూనిట్లను కేటాయిస్తారు.

ఈ ప్రాజెక్టుకు సంప్రదాయ ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా, ప్రైవేట్ డెవలపర్లను ఆకర్షించేందుకు 'ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్' విధానాన్ని కీలకమైన అంశంగా చేర్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్టంగా 1:4 నిష్పత్తి వరకు టీడీఆర్ నిష్పత్తిని బిడ్డింగ్ పారామిటర్‌గా అనుమతించారు.

పోటీతత్వ టెండర్ విధానం ద్వారా తక్కువ టీడీఆర్ ప్రతిపాదించే ప్రైవేట్ సంస్థకు ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును అప్పగిస్తారు. నిర్మాణ వ్యయానికి పరిహారంగా ఈ టీడీఆర్ హక్కులను పొందే డెవలపర్, పట్టణంలోని విలువైన భూమిని మార్కెట్ ఆధారిత యంత్రాంగం ద్వారా సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవకాశం లభిస్తుంది.

ఈ పునర్నిర్మాణ ప్రాజెక్టును లాభదాయకంగా, వేగవంతంగా పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ భవన నిబంధనల (AP Building Rules) కింద ప్రభుత్వం అనేక ప్రత్యేక సడలింపులను ఇచ్చింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఎత్తైన భవనాల నిర్మాణానికి అనుమతి ఇస్తున్నారు. స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకుని సాధారణ సెట్‌బ్యాక్ నిబంధనల తగ్గించారు.

సాధారణంగా ఉండే 22 శాతం పార్కింగ్ స్థల నియమాన్ని సవరించి, మొత్తం నిర్మిత ప్రాంతంలో కేవలం 10 శాతానికి పార్కింగ్ మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. జీవీఎంసీ, పట్టణాభివృద్ధి సంస్థలు, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు చెల్లించాల్సిన వివిధ రకాల రుసుములు, ఛార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది.

వెలంపేట పునర్నిర్మాణాన్ని నిర్ణీత సమయపరిమితిలోగా పూర్తి చేసి, దీనిని మోడల్ ప్రాజెక్టుగా మార్చాలని జీవీఎంసీని ప్రభుత్వం ఆదేశించింది. దీని విజయవంతమైన అమలు ఆధారంగా, విశాఖ వ్యాప్తంగా నివసిస్తున్న పేద ప్రజలను వారి పాత నివాస ప్రాంతాల నుండి ఎక్కడికీ తరలించకుండా, వారు ఉన్న చోటే ఆధునిక గృహాలను అందించే ఆలోచన చేస్తున్నారు.

దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మురికివాడల పునర్నిర్మాణం, మధ్యతరగతి గృహనిర్మాణం కోసం ఒక నూతన విధివిధానాల కరపత్రాన్ని రూపొందించాలని పురపాలక పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మోడల్ విజయవంతమైతే, ఆంధ్రప్రదేశ్ అంతటా పాతబడిన, రద్దీగా ఉన్న పట్టణ ప్రాంతాలను నవీకరించడానికి, అత్యంత విలువైన పట్టణ భూములను ఆర్థికంగా సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక విప్లవాత్మకమైన మార్గదర్శకంగా నిలుస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More