తెలంగాణ : 43 ఏళ్లలో ఈ జిల్లాలోనే అత్యధిక కరువు ప్రభావం.. పరిశోధకుల సూచనలు ఇవే!

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అధిక హెచ్చుతగ్గులతో కూడిన వర్షపాతం కారణంగా తెలంగాణలోని కరువు పీడిత జిల్లాలు తీవ్ర వాతావరణ సవాలును ఎదుర్కొంటున్నాయి. గత 43 ఏళ్లుగా అధ్యయనం చేసిన ఆరు జిల్లాల్లో రంగారెడ్డి అత్యంత ప్రమాదకర జిల్లాగా నిలిచింది.

Published on: Sep 19, 2026, 12:15:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గడిచిన 43 సంవత్సరాల (1981-2023) డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు తెలంగాణలో వాతావరణ మార్పులపై కీలక విషయాలను వెల్లడించారు. అధ్యయనం చేసిన ఆరు జిల్లాల్లో కంటే రంగారెడ్డి జిల్లా తీవ్రమైన Climate Stress గురవుతోందని తేలింది. తక్కువ వర్షపాతం, వర్షపాతంలో తీవ్ర తీవ్రత వ్యత్యాసాలు, నిరంతరం పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ జిల్లాలో కరువు ముప్పును విపరీతంగా పెంచాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ పరిశోధన నివేదిక 'ఇంటిగ్రేటెడ్ డ్రాట్ డయాగ్నోస్టిక్స్ ఇన్ తెలంగాణ (1981-2023)' పేరుతో వెలువడింది. భారత వాతావరణ శాఖ అందించిన 43 ఏళ్ల వర్షపాతం, ఉష్ణోగ్రతల డేటాను ఆధునిక మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా విశ్లేషించి ఈ అధ్యయనాన్ని రూపొందించారు. పరిశోధకులు ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను అధ్యయనం చేశారు.

ఆరు జిల్లాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు ఏడాదికి సగటున 0.03 డిగ్రీల నుండి 0.06 డిగ్రీల వరకు పెరుగుతున్నట్లు స్పష్టమైంది. ప్రతి ఏటా మే నెల అత్యంత వేడి కలిగిన నెలగా మారుతోంది. ఈ నెలలో సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు నమోదువుతున్నాయి. ఈ అధ్యయన వ్యవధిలో అత్యధిక ఉష్ణోగ్రత 1984లో ఖమ్మంలో 44.1 డిగ్రీలుగా నమోదైంది.

అధ్యయనం చేసిన జిల్లాల్లో కల్లా రంగారెడ్డి అతితక్కువగా 548.9 మి.మీ సగటు వర్షపాతాన్ని నమోదు చేయగా, ఖమ్మం జిల్లా అత్యధికంగా 927.6 మి.మీ వర్షపాతాన్ని పొందింది. వర్షపాత వ్యత్యాసంలో రంగారెడ్డి 35 శాతం కంటే ఎక్కువ కోఎఫీషియంట్ వ్యత్యాసంతో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. ఖమ్మంలో ఇది కేవలం 22 శాతం మాత్రమే ఉంది.

పరిశోధించిన జిల్లాల్లో దాదాపు 7,493 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో రంగారెడ్డి అతిచిన్న జిల్లా. ఇక్కడ ఎక్కువ శాతం ఎర్ర నేలలు, ఇసుకతో కూడిన తేలికపాటి నేలలు ఉండటం వల్ల నీటిని పట్టి ఉంచే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. జిల్లాలో పంటల సాంద్రత 115 శాతం కాగా.. ఇక్కడ ప్రధానంగా వరి, జొన్న/మెక్కజొన్న, కూరగాయలను సాగు చేస్తున్నారు.

వివిధ కరువు సూచీల ప్రకారం మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 20 శాతం నుండి 30 శాతం.. సంవత్సరాలు తీవ్ర కరువు పరిస్థితులతో ముగిశాయి. స్టాండర్డైజ్డ్ ప్రిసిపిటేషన్ ఇండెక్స్ (SPI) ప్రకారం ప్రతి జిల్లాలో 6 నుండి 9 కఠినమైన కరువు సంవత్సరాలు నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్ర వార్షిక వర్షపాతంలో 79 శాతం వర్షపాతం నైరుతి రుతుపవనాల ద్వారానే వస్తుంది. ఆగస్టు నెలలో అత్యధికంగా 29.7 శాతం వర్షపాతం నమోదువుతుంది. జూలై నెలలో 21.2 శాతం, సెప్టెంబర్ నెలలో 18.6 శాతం వర్షపాతం పడుతుంది.

ఈ వివరాలు తెలంగాణ వ్యవసాయం, తాగునీటి వ్యవస్థలు కేవలం కొన్ని రుతుపవన నెలలపై ఎంతగా ఆధారపడి ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో తీవ్ర మార్పుల వల్ల సంభవించే కరువును ఎదుర్కొనేందుకు పరిశోధకులు పలు సూచనలు చేశారు.

రంగారెడ్డి వంటి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాల సద్వినియోగానికి బిందు, తుంపర సేద్యాలను పెంచాలి. తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు) సాగును ప్రోత్సహించాలి. వేగంగా అర్బనైజేషన్ అవుతున్న రంగారెడ్డి జిల్లాలో పచ్చదనాన్ని పెంచడం ద్వారా ఉష్ణోగ్రతల తీవ్రతను అరికట్టవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More