కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 5వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో మార్చి 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. ఈ వివరాలను టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు - వాహనసేవల వివరాలు :
- మార్చి 27. 03.2026 : ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 9.30 నుండి 10.15 గంటల వరకు వృషభ లగ్నం), ఉదయం 11 గం.ల నుండి 12 గం.ల వరకు శ్రీరామనవమి ఆస్థానం, సాయంత్రం 4 గం.ల నుండి పోతన జయంతి, కవి సమ్మేళనం. రాత్రి శేష వాహన సేవ నిర్వహిస్తారు.
- 28.03.2026: ఉదయం – వేణుగానాలంకారము, రాత్రి – హంస వాహనం
- 29.03.2026 : ఉదయం – వటపత్రశాయి అలంకారము, రాత్రి – సింహ వాహనం
- 30.03.2026: ఉదయం – నవనీత కృష్ణాలంకారము, రాత్రి – హనుమంత వాహనం
- 31.03.2026 : ఉదయం – మోహినీ అలంకారము, రాత్రి – గరుడసేవ
- 01-04-2026 : ఉదయం – శివధనుర్భాణ అలంకరణ, మద్యాహ్నం 03.15 గం.లకు కాంత కోరిక, ఎదుర్కోలు ఉత్సవం సాయంత్రం 06.30 గం.ల నుండి 08.30 గం.ల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం. రాత్రి గజవాహన సేవ నిర్వహిస్తారు.
- 02-04-2026 : ఉదయం – రథోత్సవం
- 03-04-2026 : ఉదయం – కాళీయమర్ధనాలంకారము, రాత్రి – అశ్వవాహనం
- 04-04-2026 : ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం.
- ఏప్రిల్ 05వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం ఉంటుంది.
ఒంటిమిట్ట బ్రహ్మోత్సాల సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్ అధికారులకు సూచించారు. టీటీడీ అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడిన ఆయన… మార్చి 26న అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమై, మార్చి 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని తెలిపారు. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పట్టు వస్త్రాల సమర్పణ జరగనుందని చెప్పారు.
ఈ సందర్భంగా టీటీడీ జేఈవో వి వీరబ్రహ్మం మాట్లాడుతూ…. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, గ్యాలరీలు, పార్కింగ్, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ వంటి ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.