AP SSC Marks Memo Download : ఏపీ పదో తరగతి మెమోలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రాథమికంగా షార్ట్ మెమోలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ షార్ట్ మెమోలను అధికారిక వెబ్సైట్తో పాటు సంబంధిత పాఠశాలల లాగిన్ ఐడీలలో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మెమోలను డౌన్లోడ్ చేసుకుని వివరాలను పరిశీలించుకోవచ్చు.
ఎడిట్ ఆప్షన్…

ఈసారి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కుల మెమోలలో విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు లేదా ఇతర వివరాలు ఏవైనా తప్పుగా నమోదైతే… వాటిని ఆన్లైన్లోనే సరి చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 'ఎడిట్ ఐచ్ఛికం' (Edit Option) తీసుకువచ్చారు.
ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు విద్యార్థులు తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల (HM) ద్వారా వివరాలను ఆన్లైన్లో సరిచేయించుకోవచ్చు. మార్కుల జాబితా అనేది జీవితకాలం అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన పత్రం కాబట్టి…. విద్యార్థులందరూ తమ షార్ట్ మెమోలను జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా తప్పులుంటే వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్ను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏపీ టెన్త్ ఫలితాల్లో 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 87.9 శాతం ఉత్తీర్ణత,, బాలురు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు.
పదో తరగతి ఫలితాల్లో 96.07 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అలాగే… 57.12 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. ఏపీ టెన్త్ ఫలితాలను https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారానూ పొందొచ్చు. ఏపీలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది పబ్లిక్ పరీక్షలు రాశారు.