...
...
Next Story

AP Assembly Budget Session 2026 : అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ - బడ్జెట్ ఏ రోజంటే..?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటన జారీ అయింది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు.

Published on: Jan 31, 2026 12:15 PM IST
Advertisement

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అదే రోజు ఉభయ సభలనూ ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. ఇందులో బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించిన అజెండాను సిద్ధం చేస్తారు. అంతేకాకుండా సభను ఎన్ని రోజులపాటు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.

పద్దు ఏ రోజంటే..?

ఫిబ్రవరి 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ్యులు ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజంతా ఈ తీర్మానంపై చర్చ ఉంటుంది. అయితే ఫిబ్రవరి 14వ తేదీన బడ్జెట్ ను సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు ఫిబ్రవరి 3వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఫిబ్రవరి 2వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ కేబినెట్ భేటీలో… అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పనతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.

మరోవైపు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2026-27 బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టనుంది. ఆ రోజు ఆదివారమైనా లోక్‌సభ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను సభకు సమర్పిస్తారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఆధారంగా పలు అంశాలపై కసరత్తు చేసే అవకాశం ఉంటుంది. ఏపీకి కేటాయించిన నిధులు, రాబోయే నిధులపై ఓ అంచనాకు వస్తుంది. దీని ఆధారంగా… కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా భాగం చేసుకునేలా పద్దును రూపకల్పన చేసే అవకాశం ఉంటుంది.

మరోవైపు ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరవుతారా..? లేక గతంలోనే మాదిరిగానే దూరంగా ఉంటారా అన్న చర్చ జరుగుతోంది. సభకు వరుసగా గైర్హాజరవుతున్న ఎమ్మెల్యేల సభ్యత్వంపై వేటు వేయాలనే డిమాండ్ కూడా అధికార పక్షం వైపు నుంచి వినిపిస్తోంది. పలుమార్లు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ సభకు రాకుండా దూరం ఉండమేంటని ప్రశిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ సభ్యులు ఈసారి ఏం చేస్తారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.

మరోవైపు కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంశాల వారీగా ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటానికి కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందంటూ కూడా పలుమార్లు నిలదీశారు. ప్రతిపక్ష హోదా ఇస్తే.. సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుందన్నారు. ఈ కారణంతోనే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం లేదని కూడా జగన్ దుయ్యబడుతున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe