Budget 2026 : ఆదాయపు పన్ను తగ్గుతుందా? ఈ బడ్జెట్పై మధ్యతరగతి ప్రజల ఆశలు, అంచనాలు..
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2026 విడుదల కానున్న నేపథ్యంలో సామాన్యులు, మధ్యతరగతి వర్గాలు పన్ను మినహాయింపులు, ధరల నియంత్రణపై గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా పన్ను స్లాబుల సవరణ, గృహ రుణాలపై ఊరట కోసం వేచి చూస్తున్నాయన నిపుణులు చెబతున్నారు.
కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న తరుణంలో మధ్యతరగతి కుటుంబాల్లో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈసారి ప్రజలు మరీ ఆకాశాన్ని అంటే డిమాండ్లు కాకుండా, వాస్తవికమైన మార్పులనే కోరుకుంటున్నారు! ప్రధానంగా ఆదాయ స్థిరత్వం, అదుపులో ఉండే ధరలు, గృహ నిర్మాణం, ఆరోగ్యం వంటి నిత్యం ఎదుర్కొనే ఖర్చులను తగ్గించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఆశిస్తున్నారు.
బడ్జెట్ 2026- ఎప్పుడు?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం) ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా 9వ బడ్జెట్ ప్రసంగం.
బడ్జెట్ 2026- పన్ను భారానికి మోక్షం లభించేనా?
బడ్జెట్ ముందస్తు చర్చలపై 'మ్యాక్సిమ్ వెల్త్' వ్యవస్థాపకుడు, సీఈఓ రామ్ మేడూరి స్పందిస్తూ.. "ప్రతి ఏటా బడ్జెట్ అనగానే వేతన జీవుల మనసులో మెదిలే మొదటి ప్రశ్న.. ఈ ఏడాదైనా పన్నులు న్యాయబద్ధంగా కనిపిస్తాయా? అని! ఈసారి బడ్జెట్ 2026 పై ఆ అంచనాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి," అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న 30 శాతం పన్ను స్లాబ్ను పెంచడం, మధ్యలో ఉన్న స్లాబులను సరళీకరించడం, పన్ను పరిమితులను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మార్చడం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
మధ్యతరగతి కుటుంబాలకు పన్నుల్లో ఎలాంటి మార్పు వచ్చినా, అది వారి నెలవారీ నగదు ప్రవాహానికి పెద్ద ఊరటనిస్తుంది. భారతీయ ఉద్యోగుల జీతాలు క్రమంగా పెరుగుతున్నా, పన్ను స్లాబులు మాత్రం సుదీర్ఘ కాలంగా మారకుండా ఉండటం గమనార్హం. మధ్యతరగతి ప్రజలకు స్థిరమైన ఉపాధి, అదుపులో ఉండే ద్రవ్యోల్బణం లభిస్తే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది.
పెట్టుబడిదారుల ధోరణిలో మార్పు
మరోవైపు పెట్టుబడిదారుల ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తోందని 'వెస్టెడ్ ఫైనాన్స్' సీఈఓ విరామ్ షా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రజలు విదేశీ పెట్టుబడులను కేవలం స్వల్పకాలిక లాభాల కోసం కాకుండా, దీర్ఘకాలిక భద్రత కోసం చూస్తున్నారని ఆయన అన్నారు. గతంలో కేవలం రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం పెట్టుబడులు పెట్టేవారు, ఇప్పుడు తమ పిల్లల విదేశీ విద్య, డాలర్ ఆధారిత ఆస్తులపై దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు.
"ఈ నేపథ్యంలో, రాబోయే కేంద్ర బడ్జెట్ 2026 గ్లోబల్ మార్కెట్లలో పెట్టుబడులను సులభతరం చేసేలా ఉండాలి. ముఖ్యంగా లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద టీసీఎస్ పరిమితులను సవరించడం, రేట్లను హేతుబద్ధీకరించడం వల్ల లిక్విడిటీ పెరుగుతుంది. గిఫ్ట్ సిటీని అంతర్జాతీయ పెట్టుబడి గేట్వేగా బలోపేతం చేయడం కూడా ఇందులో కీలకం. 2,50,000 డాలర్ల ఎల్ఆర్ఎస్ పరిమితిని కొనసాగించడం వల్ల పెట్టుబడిదారుల్లో స్థిరత్వం, ధైర్యం పెరుగుతుంది," అని విరామ్ షా వివరించారు.
సొంతింటి కల.. పెరిగిన ధరల సవాలు
'బేసిక్ హోమ్ లోన్' కో-ఫౌండర్, సీఈఓ అతుల్ మోంగా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ ఆర్థికంగా బలంగా ఉందని తెలిపారు. ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన 4% ±2% పరిధిలోనే ఉండటం సానుకూల అంశమని పేర్కొన్నారు.
అయితే మధ్యతరగతి కుటుంబాలకు గృహ లభ్యత అనేది నేడు అతిపెద్ద సమస్యగా మారిందని అభిప్రాయపడ్డారు. దేశ జీడీపీలో దాదాపు 7 శాతం వాటా కలిగి ఉండి, మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తున్న గృహ నిర్మాణ రంగం ఇప్పుడు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
"ప్రస్తుతం ఇళ్ల డిమాండ్ కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. టాప్ 8 నగరాల్లో 50 శాతం అమ్మకాలు జరుగుతున్నప్పటికీ, జైపూర్, సూరత్, కోయంబత్తూర్, భువనేశ్వర్ వంటి టైర్-2, టైర్-3 నగరాల నుంచి 40 శాతం మంది తొలిసారి ఇల్లు కొనేవారు వస్తున్నారు. ప్రస్తుతం 55 శాతం మంది కొనుగోలుదారులు 40 ఏళ్లలోపు వారే. ముఖ్యంగా నాన్-మెట్రో మార్కెట్లలో రూ. 50 లక్షల లోపు ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది," అని అతుల్ మోంగా విశ్లేషించారు.
అటువంటి వారికి 20-25 ఏళ్ల గృహ రుణం అనేది ఒక దీర్ఘకాలిక నిబద్ధత అని, వారికి వడ్డీ రేట్ల కంటే కూడా స్థిరమైన ఈఎంఐలు, పన్ను ప్రయోజనాలపై స్పష్టత, సులభంగా రుణం లభించడం వంటి అంశాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


