భారత్కు ట్రంప్ టారిఫ్ వార్నింగ్: రష్యా ఆయిల్ కొంటే 500% పన్ను ముప్పు
రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేందుకు అమెరికా కొత్త చట్టం తెస్తోంది. దీని ప్రకారం రష్యా ఆయిల్ కొనే దేశాల ఉత్పత్తులపై 500% వరకు టారిఫ్ విధించే అవకాశం ఉంది. భారత్ ఇప్పటికే దిగుమతులను తగ్గించినప్పటికీ, ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థికంగా అడ్డుకట్ట వేసే క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి చౌకగా ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై ఒత్తిడి పెంచేందుకు రూపొందించిన 'రష్యా ఆంక్షల బిల్లు-2025'కు ఆయన పచ్చజెండా ఊపారు.

ఏంటీ 'రష్యా ఆంక్షల చట్టం 2025'?
అమెరికాలోని రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీలు సంయుక్తంగా (Bipartisan) రూపొందించిన ఈ బిల్లు లక్ష్యం ఒక్కటే.. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. ఉక్రెయిన్పై పుతిన్ సాగిస్తున్న యుద్ధానికి అవసరమైన నిధులు చమురు విక్రయాల ద్వారానే అందుతున్నాయని అమెరికా భావిస్తోంది.
ఈ బిల్లులోని ప్రధానాంశాలు:
500% టారిఫ్: రష్యా నుంచి చమురు, గ్యాస్ లేదా యురేనియం దిగుమతి చేసుకునే దేశాల ఉత్పత్తులపై అమెరికా కనీసం 500% పన్ను (Tariff) విధిస్తుంది. ఇది నేరుగా భారత్, చైనా వంటి ప్రధాన కొనుగోలుదారులను టార్గెట్ చేస్తోంది.
వెన్నువిరిచే ఆంక్షలు: రష్యా శాంతి చర్చలకు అంగీకరించకపోయినా లేదా ఒప్పందాలను ఉల్లంఘించినా, ప్రతి 90 రోజులకు ఒకసారి పరిస్థితిని సమీక్షించి అత్యంత కఠినమైన (Bone-crushing) ఆంక్షలు విధిస్తారు.
ఆస్తుల జప్తు: పుతిన్తో పాటు రష్యాకు చెందిన ప్రముఖులకు (Oligarchs) అమెరికాలో ఉన్న ఆస్తులను స్తంభింపజేయడం, రష్యా ఇంధన రంగంలో అమెరికా పెట్టుబడులను నిషేధించడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి.
భారత్ పై ప్రభావం ఎంత?
గతంలో రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. దీనివల్ల గతేడాది ఆగస్టులో భారత్ ఉత్పత్తులపై అమెరికా పన్నును 50 శాతానికి పెంచింది. అయితే, ప్రస్తుత గణాంకాల ప్రకారం భారత్ తన దిగుమతులను గణనీయంగా తగ్గించుకుంది.
జూన్ 2024తో పోలిస్తే డిసెంబర్ నాటికి దిగుమతులు 40% తగ్గాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ కంపెనీలు జనవరిలో రష్యా నుంచి చమురు ఆర్డర్లు ఏమీ ఇవ్వలేదని తెలుస్తోంది.
మోదీపై ట్రంప్ వ్యాఖ్యలు.. భారత్ స్పష్టత
"ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు నేను అసంతృప్తిగా ఉన్నానని ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు దిగుమతులు తగ్గించారు. నన్ను సంతోషపెట్టడమే ఆయనకు ముఖ్యం" అని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు.
అయితే, ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తామని ప్రధాని మోదీ ఎటువంటి హామీ ఇవ్వలేదని, అటువంటి సంభాషణలేవీ జరగలేదని భారత్ స్పష్టం చేసింది.
నిపుణుల అభిప్రాయం
"పుతిన్ యుద్ధ యంత్రానికి అందుతున్న నిధులను ఆపడానికి ఈ బిల్లు ట్రంప్కు ఒక శక్తివంతమైన ఆయుధంలా పనిచేస్తుంది. భారత్, చైనా వంటి దేశాలను దారిలోకి తెచ్చుకోవడానికి ఇది అమెరికాకు గొప్ప వెసులుబాటునిస్తుంది" అని ఈ బిల్లును రూపొందించిన సెనేటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు.
అమెరికా తీసుకోబోయే ఈ దూకుడు చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


