కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అంతకంటే ముందు ప్రమాదం జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.
పరిహారం ప్రకటన…

జీజీహెచ్ లో బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు . ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
“జరిగిన విషాదం మరచిపోలేనిది…. కలిగిన నష్టం భర్తీ చేయలేనిది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించాను. ఈ కష్ట సమయంలో వారితో ఉండటం నా కర్తవ్యంగా భావించాను. శోకసంద్రంలో ఉన్న మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పాను. ప్రభుత్వ పరంగా అందించాల్సిన సాయం అందిస్తాము” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.
20 మంది మృతి…!
సామర్లకోట మండలంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో ఇవాళ మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.