CM CBN in Aseembly : పేద కుటుంబాలకు ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయిస్తాం - సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని 2.20 లక్షల కుటుంబాలకు ఇంటి జాగాలు లేవని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. వారందరికీ పట్టణ ప్రాంతాల్లో అయితే 2, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఉచితంగా కేటాయిస్తామని తెలిపారు. 

Published on: Feb 27, 2026 8:56 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2.20 లక్షల కుటుంబాలకు ఇంటి జాగాలు లేవన్నారు. వారందరికీ పట్టణ ప్రాంతాల్లో అయితే 2, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఉచితంగా కేటాయిస్తామని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు

శుక్రవారం వ్యవసాయం, అనుబంధ రంగాలు, హౌసింగ్ బడ్జెట్ పద్దుపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. గత పాలకులు హౌసింగ్ లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఇసుక విధానాన్ని కూడా అస్తవ్యస్తం చేసి అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. ఈ అక్రమాల్లో భాగస్వాములైన వారిని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.

“అందరికీ ఇళ్లు ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను రాయచోటి నుంచి ప్రారంభించాం. ఈ ఏడాది ఉగాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తాం. జూన్‌కు 2.26 లక్షలు, సెప్టెంబరులో 2.10 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు జరిగేలా కార్యక్రమం చేపట్టాం. మొత్తంగా ఈ ఏడాదిలో 10.63 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

దరఖాస్తు చేసుకోండి - సీఎం చంద్రబాబు

ఇళ్లు రాని వాళ్లంతా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాయని చెప్పారు. గత పాలకులు చేసిన తప్పును సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని… త్వరలోనే దీనిపై కార్యాచరణ చేపడతామని వివరించారు. 2029లోగా పేదలందరికీ ఇళ్లు కట్టించటంతో పాటు ఉచితంగా ఇంటి స్థలాలు కూడా ఇస్తామని భరోసా ఇస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయని సీఎం ప్రకటించారు. ఈ ఏడాది 69 వేల కనెక్షన్లు కొత్తగా ఇచ్చామన్నారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల మొత్తాన్ని రైతులకు మూడు విడతల్లో ఇస్తున్నామని తెలిపారు. 47 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు పంటనష్టపోయిన రైతులకు పెట్టబడి రాయితీ ఇచ్చామన్నారు. రూ.10,816 కోట్ల మేర 24 గంటల్లో ధాన్య కొనుగోళ్ల కోసం రైతులకు చెల్లించామని వివరించారు.

“వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్‌ పై పెద్ద ఎత్తున దృష్టి పెట్టాం. 8,168 గ్రామాల్లో 15 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారు. త్వరలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సాహం ఇస్తున్నాం. ప్రస్తుతం రాయలసీమలో ఉద్యాన పంటలు 400 మిలియన్ టన్నుల మేర సాగు అవుతున్నాయి. వెయ్యి మిలియన్ మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి అయ్యేలా లక్ష్యంగా పనిచేస్తున్నాం. క్లస్టర్ విధానం ద్వారా ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో ఈ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి తెలిపారు.