ఉగాదిలోపు 5 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం.. ప్రతీ మూడు నెలలకోసారి గృహప్రవేశం : మంత్రి పార్థసారథి
మరో ఐదు లక్షల ఇళ్లను ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సీఎం, మంత్రులు కష్టపడి పని చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని చెప్పారు. టెక్నాలజీ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటున్నామని మంత్రి వెల్లడించారు.

'గృహనిర్మాణ శాఖ విషయంలో మూడు లక్షల ఇళ్లు పూర్తి చేసిన సందర్భంగా కీ హ్యాండోవర్ కార్యక్రమం నిర్వహించాం. ఆ కార్యక్రమాన్ని కూడా వైసీపీ వివాదం చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 8 లక్షల 627 ఇళ్లు పూర్తయ్యాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 6 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి.' అని మంత్రి పార్థసారథి తెలిపారు.
16 నెలల్లో మూడు లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేశామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. మరో అయిదు లక్షల ఇళ్లను ఉగాదిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా ప్రారంభం కాని ఇళ్లు మూడు లక్షల 30 వేల ఉన్నాయన్నారు. మెుత్తం 15.59 లక్షల ఇళ్లు ఈ అయిదు సంవత్సరాలలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
'హౌసింగ్ ఫర్ ఆల్ అని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి గృహప్రవేశం చేయిస్తాం. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు కామన్ వాల్తో కలిపి కట్టుకునేందుకు జీవో ఇస్తాం.'అని మంత్రి తెలిపారు.
మరోవైపు గత ప్రభుత్వంపై మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. 18 లక్షల ఇళ్లకు గానూ 30 శాతం మాత్రమే పూర్తి చేశారన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వం నిర్మించే ఇళ్ల స్కీమ్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కాంట్రాక్ట్ తీసుకున్న రాక్రీట్ నిర్మాణ సంస్థ అన్యాయం చేసిందన్నారు 47 వేల 850 ఇళ్లు తీసుకుని.. నిర్మిస్తామని చెప్పి ఎక్కడా పూర్తి చేయలేదని చెప్పారు.
అప్పుడు 80 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని విజిలెన్స్ విచారణలో బయటపడిందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఆ సంస్థపై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఆప్షన్ 3లో పేమెంట్ కింద చివరి దశలో ఉన్న నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం చెప్పిందన్నారు.













