AP Degree Admissions 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని ఉన్నత విద్యాశాఖ సూచించింది.

డిగ్రీ కోర్సుల్లో చేరానుకునే విద్యార్థులు ఈ నెల 11వ తేదీ వరకు అధికారిక పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.హెల్ప్డెస్క్ సెంటర్లలో విద్యార్థుల ధ్రువపత్రాల (సర్టిఫికెట్లు) పరిశీలన ప్రక్రియ ఈ నెల 5వ తేదీన ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతుంది.ప్రత్యేక కేటగిరీల పరిశీలన ఎన్సీసీ, స్పోర్ట్స్, దివ్యాంగులు తదితర ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను ఈ నెల 12, 13 తేదీల్లో పరిశీలిస్తారు.
ఈనెల 26న సీట్ల కేటాయింపు…
తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు సమయం ఇచ్చారు. నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే ఈ నెల 20వ తేదీన ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. విద్యార్థులు నమోదు చేసుకున్న ఆప్షన్లు, మెరిట్ మార్కుల ఆధారంగా ఈ నెల 26న సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడిస్తారు.
సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 27 నుంచి 29వ తేదీల మధ్య తమకు కేటాయించిన కళాశాలలకు నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి. మరోవైపు డిగ్రీ మొదటి సంవత్సరం రెగ్యులర్ తరగతులను ఈ నెల 27వ తేదీ నుంచే ప్రారంభిస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. కాబట్టి విద్యార్థులు సమయం వృథా చేయకుండా నిర్ణీత గడువు లోపలే రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది.
రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం ఇలా…
- ప్రవేశాల కోసం విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ https://cap.apcfss.in/ ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో కనిపించే 'Register Now' అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- అక్కడ అడిగిన మీ ప్రాథమిక వివరాలైన పేరు, ఆధార్ సంఖ్య, మొబైల్ నంబర్లను సరిగ్గా ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్ చేసి లాగిన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
- లాగిన్ అయిన తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించి, అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.