కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికపై ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. రోడ్డు కోసం చేసిన విజ్ఞప్తిని విన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… నిమిషాల వ్యవధిలోనే నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే రహదారి మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. డిప్యూటీ సీఎం నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే…?

మంగళవారం కానిస్టేబుళ్లుగా నియామాకం అయిన వారికి పత్రాలు అందజేశారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హాజరయ్యారు. సభా వేదికపై కానిస్టేబుల్ గా నియమితుడైన గిరిజన యువకుడు లాకే బాబూరావు మాట్లాడుతూ… తన సక్సెస్ స్టోరీ వివరించారు. ఈ క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు.
బాబూరావు కోరిక మేరకు అతని గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి కు అప్పగించారు. దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీకే వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తెనుములబండ గ్రామానికి బీటీ రోడ్డును మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
తక్షణమే రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి అనుమతులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పవన్ ఆదేశాలతో ఆఘమేఘాలపై కదిలిన యంత్రాంగం తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల మేర రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు.