AP EAPCET 2026 Key : ఏపీ ఎప్సెట్ అభ్యర్థులకు అలర్ట్ - ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి
AP EAPCET 2026 Keys :ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ (AP EAPCET 2026) రాసిన విద్యార్థులకు అలర్ట్. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు అధికారిక వెబ్సైట్లో విడుదలయ్యాయి. మే 27 లోగా అభ్యంతరాలు తెలపవచ్చు.
AP EAPCET 2026 Keys: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) పరీక్ష రాసిన విద్యార్థులకు ఉన్నత విద్యామండలి కీలక అప్డేట్ ఇచ్చింది. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రవేశ పరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ కీలు (Preliminary Answer Keys) అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు విద్యార్థులు పరీక్షలో మార్క్ చేసిన జవాబులతో కూడిన 'రెస్పాన్స్ షీట్లను' (Response Sheets) సైతం వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.

అభ్యంతరాలకు ఇదే గడువు…
ఏపీ ఈఏపీసెట్ 2026 ప్రిలిమినరీ కీపై విద్యార్థులకు ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఈఏపీసెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 27వ తేదీ ఉదయం 11:00 గంటల వరకు మాత్రమే ఈ అభ్యంతరాలను స్వీకరిస్తారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే ఎలాంటి దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోరని స్పష్టం చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/ ద్వారా తమ లాగిన్ వివరాలను నమోదు చేసి కీ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఆబ్జెక్షన్లను రైజ్ చేయవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా మే 12 నుండి మే 20వ తేదీ వరకు పలు పరీక్షా కేంద్రాల్లో ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు రికార్డు స్థాయిలో విద్యార్థులు హాజరయ్యారు.
ఈఏపీసెట్ 2026 హాజరు గణాంకాలు:
- మొత్తం దరఖాస్తులు : రాష్ట్రవ్యాప్తంగా 3,55,803 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,29,474 మంది (92.60 శాతం) పరీక్షకు హాజరయ్యారు.
- ఇంజినీరింగ్ (MPC స్ట్రీమ్) : ఈ విభాగానికి 2,76,576 మంది రిజిస్టర్ చేసుకోగా, 2,58,545 మంది (93.48 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు.
- అగ్రికల్చర్, ఫార్మసీ (BiPC స్ట్రీమ్) : ఈ విభాగానికి 79,227 మంది దరఖాస్తు చేయగా, 70,929 మంది (89.53 శాతం) విద్యార్థులు హాజరయ్యారు.
ముందుగా ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం.. జూన్ 1వ తేదీన ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలను (Results) విడుదల చేయాల్సి ఉంది. అయితే ఈసారి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు అవకాశం కల్పించింది. ఈఏపీసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ వెయిటేజీ మార్కులను కూడా కలపాల్సి ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ పరీక్షల ప్రక్రియ ముగిసి, ఆ మార్కులు వచ్చే వరకు వేచి చూడాల్సి రావడంతో జూన్ 1న ఫలితాల వెల్లడిపై ప్రస్తుతం స్పష్టత కరువైంది. ఈ విషయంపై విద్యాశాఖ నుంచి ఒకట్రెండు రోజుల్లో అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఏపీ ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే కంబైన్డ్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని కాలేజీల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. ఫలితాల అనంతరం ఉన్నత విద్యా మండలి విడతల వారీగా కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించి ఆన్లైన్ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనుంది. కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత కూడా సీట్లు మిగిలితే కాలేజీల వారీగా స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ అవుతాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

