విద్యార్థులకు గుడ్న్యూస్.. సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయనున్నట్టుగా వెల్లడించింది.
పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు మిడ్ డే మిల్స్ స్కీమ్ను సెలవు రోజుల్లోనూ అందించనుంది. పదో తరగతి విద్యార్థుల పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. మరోవైపు 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మార్చి దాకా సెలవు రోజుల్లో సైతం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది.

సెలవు రోజుల్లో స్పెషల్ క్లాసులకు హాజరు అయ్యే టెన్త్ విద్యార్థులకు రోజు వారీ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని విద్యా శాఖ ఆదేశాలు ఇచ్చింది. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్ష కారణంగా ప్రతి నెలా రెండో శనివారం, ఆదివారం స్పెషల్ క్లాసులకు హాజరవుతారు. ఇటీవల పేరెంట్స్ టీచర్ మీటింగ్ సమయంలో ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వచ్చింది. విద్యార్థులు ఆకలితో క్లాసులు వినాల్సి వస్తుందని కొంతమంది తల్లిదండ్రులు చెప్పారు. దీంతో వెంటనే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు మెుదలవుతాయి. ఏప్రిల్ 1 వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.
పరీక్షల తేదీలు
మార్చి 16, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 18, 2026 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20, 2026 - ఇంగ్లీష్
మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)
మార్చి 25, 2026 – ఫిజిక్స్
మార్చి 28, 2026 – బయాలజీ
మార్చి 30 , 2026 – సోషల్ స్టడీస్
మార్చి 31, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
ఏప్రిల్ 1, 2026 – ఒకేషనల్ కోర్సు
పరీక్ష ఫీజు
పరీక్ష ఫీజు తేదీ ఇప్పటికే మెుదలైంది. ప్రస్తుతం రూ.200 ఫైన్ తో డిసెంబరు 4 నుంచి 10 వరకు, రూ.500 ఫైన్ తో డిసెంబరు 11 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపులు చేసుకునే వీలుంటుంది. రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 చెల్లించాలి. ఫెయిల్ అయిన విద్యార్థులు 3 పేపర్ల కంటే ఎక్కువ రాస్తే రూ. 125, మూడు పేపర్ల లోపు అయితే రూ. 110 చెల్లించాలి. వొకేషనల్ విద్యార్థులు అయితే అదనంగా రూ. 60, విద్యార్థి వయసు విషయంలో తేడాలుంటే రూ. 300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.














