మారేడుమిల్లికి వెళ్లిన విద్యార్థులను ప్రశ్నించిన పోలీసులు.. అక్కడ మావోయిస్టుల కదలికలు!
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో మావోయిస్టు కీలక నేత హిడ్మా సహా పలువురి ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి నిజనిర్ధారణ పర్యటనకు విద్యార్థులు వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మాతోపాటుగా మరికొందరు ఎన్కౌంటర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఉస్మానియా, కాకతీయ యునివర్సిటీ నుంచి విద్యార్థులు నిజనిర్ధారణకు వెళ్లారు. ఈ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులను చింతూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఎనిమిది మంది విద్యార్థులను పోలీసులు ప్రశ్నించారని శనివారం ఒక అధికారి తెలిపారు. వారందరినీ తరువాత వెళ్ళడానికి అనుమతించారని అన్నారు.

'ఆపరేషన్ సంభవ్' కింద పోలీసులు రెండు రోజుల్లో 13 మంది మావోయిస్టులను అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో కాల్చి చంపారు. నవంబర్ 18న ఆరుగురు, నవంబర్ 19న ఏడుగురు మరణించారు. 'విద్యార్థులను అదుపులోకి తీసుకోలేదు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పరిశీలించారు.' అని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు సూపరింటెండెంట్(ఎస్పీ) అమిత్ బర్దార్ పీటీఐకి తెలిపారు.
శుక్రవారం సంఘటనా స్థలాన్ని సందర్శించేందుకు వచ్చిన విద్యార్థులు పోలీసులకు సహకరించారని ఎస్పీ వెల్లడించారు. అయితే విద్యార్థులు తమ కుటుంబ సభ్యుల కాంటాక్ట్ చేసేందుకు వివరాలను అడిగితే పంచుకోవడానికి నిరాకరించారని చెప్పారు. ముఖ్యంగా ఒడిశా సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలు పెరిగిన సమయంలో విద్యార్థుల సేఫ్టీ గురించి పోలీసులు వారికి తెలియజేయాలని కోరారని అన్నారు.
'ఒడిశా సరిహద్దులో ఇప్పుడు భారీగా మావోయిస్టు కదలిక ఉందని మాకు సమాచారం ఉంది. ఛత్తీస్గఢ్ నుండి ఒడిశాలోకి కొంతమంది వచ్చారు.' అని ఎస్పీ బర్దార్ అన్నారు.
మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న విద్యార్థులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. ఇటీవలి రోజుల్లో మావోయిస్టుల ద్వారా సమస్యలు ఎదుర్కొన్న కుటుంబాలు, అభివృద్ధి కోసం చూసే సంఘాలు నిరసనలు, ర్యాలీలు నిర్వహించాయన్నారు.
గ్రామస్తులు విద్యార్థులపై దాడి చేసే అవకాశం ఉండటంతో వారిని పోలీస్ స్టేషన్కు తరలించామని పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ గురించి వాస్తవాలను తెలుసుకుని వాటిని బహిరంగంగా వెల్లడించడానికి మారేడుమిల్లి పర్యటనకు సంబంధించి కొన్ని రోజుల క్రితం బహిరంగ లేఖను విడుదల చేసినట్లు విద్యార్థులు వెల్లడించారు. ఎన్కౌంటర్ స్థలాన్ని సందర్శించడానికి తమకు అనుమతి ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

E-Paper












