ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు - 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా… ముగ్గురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు.

Published on: Dec 04, 2025 7:36 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ముగ్గురు జవాన్లు కూడా మృతి చెందారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు డీఆర్జీ జవాన్లు గాయపడ్డారు. జిల్లాలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీస్ అధికారులు తెలిపారు.

బీజాపూర్‌లో ఎదురుకాల్పులు ( ప్రతీకాత్మక చిత్రం)
బీజాపూర్‌లో ఎదురుకాల్పులు ( ప్రతీకాత్మక చిత్రం)

బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దు వెంబడి ఉన్న అడవిలో ఈ ఎదురుకాల్పులు జరిగాయని బస్తర్ రేంజ్ ఐజీ తెలిపారు. దంతెవాడ, బీజాపూర్ కు చెందిన డీఆర్జీ సిబ్బంది, స్పెషల్ టాస్క్ ఫోర్స్, రాష్ట్ర పోలీసు విభాగాలు, కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్- సీఆర్పీఎఫ్ ఎలైట్ యూనిట్) ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయని చెప్పారు.

12 మంది మావోయిస్టులు మృతి…

ఎన్ కౌంటర్ ఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు 12 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారిలో ఒకరిని మోడియం వెల్లాగా గుర్తించామని, మిగిలిన మృతుల గుర్తింపు ఇంకా తెలియరాలేదని ఆయన తెలిపారు.

వెల్లా మావోయిస్టుల పిఎల్జిఎ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) కంపెనీ నెం.2 కమాండర్ గా చురుకుగా ఉన్నాడు. 2020లో సుక్మాలో భద్రతా దళాలపై జరిగిన దాడులో కూడా పాల్గొన్నాడు. ఇందులో 17 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 2021లో 22 మంది భద్రతా సిబ్బంది మరణించిన టెకల్గూడెం (బీజాపూర్) దాడితో సహా అనేక సంఘటనలలో పాల్గొన్నాడు.

ఘటనా స్థలం నుంచి ఒక లైట్ మెషిన్ గన్, సింగిల్ లోడింగ్ రైఫిల్స్ (ఎస్ఎల్ఆర్), ఇన్సాస్ రైఫిల్స్, .303 రైఫిల్స్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో బీజాపూర్ డీఆర్జీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ మోను వడాడి, కానిస్టేబుల్ దుకారు గొండే, జవాన్ రమేష్ సోధి మృతి చెందారు.

గాయపడిన జవాన్లకు వెంటనే ప్రథమ చికిత్స అందించామని… వారు ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డారని ఐజీ తెలిపారు. పశ్చిమ బస్తర్ డివిజన్ పరిధిలోని ఎన్ కౌంటర్ స్థలానికి మరికొన్ని బృందాలను పంపామని… ఈ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతోందని బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ తెలిపారు.

భద్రతా బలగాల తాజా చర్యతో ఈ ఏడాది ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్లలో 275 మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో బీజాపూర్, దంతెవాడ సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్ లో 246 మందిని చనిపోగా…. రాయ్ పూర్ డివిజన్ పరిధిలోని గరియాబంద్ జిల్లాలో మరో 27 మంది మృతి చెందారు. దుర్గ్ డివిజన్ లోని మొహ్లా-మన్పూర్-అంబాగఢ్ చౌకీ జిల్లాలో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. ఈ సంఘటనతో ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ కౌంటర్లతో సహా మావోయిస్టు హింసలో 23 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు 2026 మార్చి 31 వరకు కేంద్రం గడువును నిర్ణయించిన సంగతి తెలిసిందే.