ఏపీలో ముస్లింలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఒక్కొక్కరికి లక్ష రూపాయలు

ఏపీలో ముస్లింలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. హజ్ యాత్రకు వెళ్లేవారికి ఆర్థిక సాయం చేయనున్నట్టుగా తెలిపింది.

Published on: Dec 17, 2025, 18:26:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లింలకు శుభవార్త చెప్పింది. హజ్ 2026 యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ నుంచి వెళ్లేవారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ మేరకు జీవో విడుదలైంది. హజ్ యాత్రికులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల నుంచి మక్కాకు వెళ్లేవారు. ఇప్పుడు విజయవాడలో ఎంబార్కేషన్ సెంటర్‌ ఏర్పాటుతో భారీ ఉపశమనం దక్కింది ఏపీ యాత్రికులకు.

ఏపీ నుంచి హజ్ యాత్ర
ఏపీ నుంచి హజ్ యాత్ర

ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చింది. అయితే రూ.లక్ష ఆర్థిక సాయం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లేవారికి మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇతర నగరాల నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారికంటే.. విజయవాడ నుంచి వెళ్లేవారికి విమాన టికెట్ ధర ఎక్కువగా ఉంటుంది. అదనపు భారం హజ్ యాత్రికులపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించాలని, అంతేకాకుండా రాజధాని అమరావతిని ప్రోత్సహించాలని ఆర్థిక సాయం అందిస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. తదుపరి చర్యల కోసం మైనారిటీ సంక్షేమ శాఖ, రాష్ట్ర హజ్ కమిటీకి ఆదేశాలు ఇచ్చింది.

హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ.లక్ష ఆర్థిక సాయంతో యాత్రికులకు ఆర్థికంగా ఊరట లభించనుంది. విమాన టికెట్ ధరల్లో వ్యత్యాసం కారణంగా కలిగే అదనపు ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి దాదాపు 347 మంది అభ్యర్థులు విజయవాడ హజ్ ఎంబార్కేషన్ సెంటర్ ద్వారా నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

హజ్ యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హజ్ కమిటీ ఛైర్మన్ షేక్ హసన్ బాషా తెలిపారు. ఈ నిర్ణయం ముస్లిం సోదరుల్లో ఆనందాన్ని నింపుతోందన్నారు. హజ్ యాత్రికులు విజయవాడ సెంటర్ నుంచి ఎంచుకోవాలని కోరారు.

మరోవైపు వక్ఫ్‌బోర్డు వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్నవారిపై చర్యలు తీసుకుంటోంది. కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలువైన వక్ఫ్ భూములను సంబంధించి 89 అక్రమ అమ్మకాల పత్రాలను రద్దు చేయించింది. వీటి విలువ సుమారు రూ.650 కోట్లు. రాష్ట్రవ్యాప్తంగా 953 నోటీసులు జారీ చేసింది. 820 ఎకరాల వక్ఫ్ భూమిని రక్షించేందురు చర్యలు చేపట్టింది. వక్ఫ్ బోర్డు ఆదాయాన్ని పెంచేందుకు ఈ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More