ఎల్ నినో ఎఫెక్ట్.. తుంగభద్ర, హంద్రీ నీవా నీరు ఇక తాగునీటికే ప్రాధాన్యత!

ఎల్ నినో ప్రభావంతో రాయలసీమ అంతటా నీటి లభ్యతపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగభద్ర, హంద్రీ నీవా సుజల స్రవంతి జలాశయాల నీటిని సాగునీటికి బదులుగా తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలని నిర్ణయించింది.

Published on: Jul 23, 2026, 10:58:29 IST
By , Rayalaseema
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎల్ నినో ప్రభావంతో అల్పవర్షపాతం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని జలాశయాల్లోకి నీటి ప్రవాహాలు భారీగా తగ్గాయి. ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా, రాయలసీమ ప్రాంతంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుంగభద్ర, హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుల నీటిని సాగునీటి అవసరాల కంటే ముందుగా కేవలం తాగునీటి కేటాయింపులకే ప్రాధాన్యత ఇస్తూ ఉపయోగించాలని నిర్ణయించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పశ్చిమ కనుమలలోని క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా బేసిన్‌లోని కీలకమైన తుంగభద్ర డ్యామ్‌లో లభ్యత తక్కువగా ఉంది. ఈ క్రమంలో తుంగభద్ర బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 20 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించింది.

కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా నది నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహాలు మందగించడంపై నీటిపారుదల శాఖ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ ఆధారంగా నడిచే హంద్రీ-నీవా ప్రాజెక్టుకు ఈ ఏడాది కేటాయింపులు తగ్గే అవకాశం ఉంది. గతేడాది ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 50 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు.

చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్: పెన్నార్ బేసిన్‌లోని ఈ జలాశయంలో నీటి నిల్వలు అట్టడుగుకు చేరడంతో కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ఆందోళన నెలకొంది.

నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు (కుప్పం వరకు) జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు తుంగభద్ర, హంద్రీ-నీవా ప్రాజెక్టులే ప్రధాన ఆధారం. కర్నూలు నగరం తాగునీటి కోసం కేసీ కెనాల్‌పై ఆధారపడుతుండగా, తుంగభద్ర హై లెవల్ కెనాల్ ద్వారా అదనపు నీటిని అందిస్తున్నారు. అనంతపురం నగరం, హిందూపురం మున్సిపాలిటీతో పాటు కళ్యాణదుర్గం, మడకశిర, రాయదుర్గం ప్రాంతాలు కుడేరు వద్ద ఉన్న పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పైపులైన్ ద్వారా తాగునీటిని పొందుతున్నాయి.

ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో ఈ అన్ని జలాశయాల్లో నీటిమట్టాలు క్షీణించడమే కాకుండా, రాయలసీమ వ్యాప్తంగా భూగర్భ జలాలు కూడా వేగంగా పడిపోయాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తుంగభద్ర హెచ్‌ఎల్‌సి, హంద్రీ-నీవా ప్రాజెక్టుల అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

'హెచ్‌ఎల్‌సీ వ్యవసాయ కాలువల వ్యవస్థలోకి నీటిని విడుదల చేసిన 25 నుండి 30 రోజులలోపే పరిధిలోని అన్ని తాగునీటి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలి. నీటి తరలింపు వేగవంతం చేసేందుకు అవసరమైన అధిక సామర్థ్యం గల మోటార్లు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నందున, రూరల్ వాటర్ సప్లై ఇంజనీర్లు వెంటనే భూగర్భ నీటిమట్టాలను సమీక్షించి, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో కొత్త బోర్‌వెల్స్ తవ్వాలి.' అని మంత్రి పయ్యావుల ఆదేశించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More