ఏపీ లిక్కర్ స్కామ్.. నాంపల్లి కోర్టుకు మాజీ మంత్రి కారుమూరి

ఏపీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన రూ. 87.7 కోట్ల ఆస్తులు జప్తు చేసిన విషయం తెలిసిందే.

Published on: Aug 24, 2026, 13:19:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ మద్యం సరఫరా, రవాణా కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరిగిన అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు తరలించారు. అరెస్టు అనంతరం ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు పూర్తి చేయించారు. ఆ తర్వాత పటిష్ట భద్రత నడుమ కోర్టులో హాజరుపరిచారు.

మాజీ మంత్రి కారుమూరి
మాజీ మంత్రి కారుమూరి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన మద్యం సరఫరా కాంట్రాక్టుల్లో భారీగా నిధులు దారిమళ్లాయని, నిబంధనలకు విరుద్ధంగా పలువురు నేతలు బినామీ పేర్లతో కోట్లాది రూపాయల లబ్ధి పొందినట్లు ఈడీ విచారణలో ఆధారాలు సేకరించింది. ఈ స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, సంబంధిత వ్యక్తులపై ముమ్మర నిఘా ఉంచారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ముందస్తుగానే కారుమూరి నాగేశ్వరరావుకు చెందిన రూ. 87.7 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. అలాగే ఈ కేసుతో సంబంధమున్న ఇతర నిందితులపై కూడా కఠిన చర్యలు కొనసాగుతున్నాయి.

కారుమూరి కుమారుడు సునీల్ ఇంట్లో జరిపిన సోదాల్లో అత్యంత విలువైన రోలెక్స్ వాచీలు, రేంజ్ రోవర్ లగ్జరీ కారును ఈడీ సీజ్ చేసింది. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన వాసుదేవరెడ్డి, రాజ్‌కెసి రెడ్డిలను కూడా అధికారులు ఇదివరకే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మద్యం కుంభకోణంలో లంచాల రూపంలో వచ్చిన డబ్బును ఎక్కడెక్కడ డిపాజిట్ చేశారు. విదేశీ ఖాతాలకు దారిమళ్లించారా అనే కోణంలో ఈడీ అధికారులు నిందితులను కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. నాంపల్లి కోర్టు తీర్పును బట్టి కారుమూరిని తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

కారుమూరిని ఆదివారం తన మిత్రుడి ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీ అడ్డం పెట్టుకుని రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తడంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. మద్యం ధరలు ఇష్టారాజ్యంగా నిర్ణయించడం, మామూళ్లు ఇచ్చిన సంస్థలకే మద్యం అవకాశం ఇవ్వడం వంటి అవకతవకలకు పాల్పడ్డారని, తద్వారా భారీగా కూడబెట్టుకున్నట్టుగా సిట్ గుర్తించింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరాలో చేతివాటం చూపారని పేర్కొన్నారు. వీటి ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More