Prakash Raj Bail: ప్రకాష్ రాజ్కు బెయిల్ ఇచ్చిన బెంగళూరు కోర్టు- రూ. 4 వేల డిపాజిట్- ఏ కేసులో అంటే?
Prakash Raj Get Bail From Bengaluru Court: 2019 లోక్సభ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్కు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒకేసారి పలు రాష్ట్రాల్లో ఓటరుగా నమోదై ఆ వివరాలను దాచారంటూ దాఖలైన ప్రైవేట్ ఫిర్యాదుపై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
Prakash Raj Get Bail From Bengaluru Court: వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్కు ఎన్నికల అఫిడవిట్ వివాదంలో పెద్ద ఊరట లభించింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఒకేసారి మూడు రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉండి, ఆ సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్లో దాచారనే ఆరోపణలపై బెంగళూరు కోర్టు ఆయనకు శరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

రూ. 4 వేల డిపాజిట్తో బెయిల్
ఈ కేసు ఇప్పుడు అధికారికంగా విచారణ (ట్రయల్) దశకు చేరుకుంది. బెంగళూరులోని చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ జ్యోతి శంతప్ప కాలే ఈ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపారు. జూలై 10వ తేదీన కోర్టుకు స్వచ్ఛందంగా హాజరైన ప్రకాష్ రాజ్కు మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు.
దీనికోసం ఆయన రూ. 4,000 భద్రతా డిపాజిట్ చెల్లించాలని, భవిష్యత్తులో జరిగే అన్ని కోర్టు విచారణలకు తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అంతకుముందు ప్రకాష్ రాజ్కు సమన్లు అందకపోవడంతో కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే ఈ వారెంట్ విషయం తెలిసిన వెంటనే ఆయన స్వయంగా కోర్టుకు వచ్చారు.
నేరుగా అందని కోర్టు వారెంట్
"నా క్లయింట్కు కోర్టు వారెంట్ నేరుగా అందలేదు. వార్తా ఛానళ్లలో చూసి మాత్రమే ఈ న్యాయపరమైన చర్యల గురించి తెలుసుకున్నాం" అని ప్రకాష్ రాజ్ తరఫు న్యాయవాది నాగార్జున కోర్టుకు వివరించారు. తమిళనాడుకు చెందిన ఓటరు ఐడీని ప్రకాష్ రాజ్ ఇప్పటికే సరెండర్ చేశారని ఆయన కోర్టుకు తెలిపారు.
ఫిర్యాదుదారుడి తరఫు న్యాయవాది ధర్మపాల్ స్పందిస్తూ, ప్రకాష్ రాజ్పై ఉన్న ఆరోపణలు కాగ్నిజబుల్ కానివి (తక్కువ తీవ్రత కలిగినవి) అని పేర్కొనడంతో న్యాయమూర్తి బెయిల్ ఇవ్వడానికి అంగీకరించారు.
అసలు వివాదం ఏంటి?
భారతదేశంలో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరం. ఈ కేసు బెంగళూరుకు చెందిన కే దిలీప్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదుతో మొదలైంది. దీనిపై ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన మేజిస్ట్రేట్ కోర్టు, 2025 ఆగస్టు 1వ తేదీన ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31, 125A కింద కేసును స్వీకరించింది.
ప్రకాష్ రాజ్ 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనకు బెంగళూరులోని శాంతినగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే ప్రకాష్ రాజ్కు ఒకే సమయంలో మరో మూడు చోట్ల కూడా ఓటు హక్కు ఉందని ఫిర్యాదుదారుడు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని వేలచ్చేరి నియోజకవర్గంలో రెండు చోట్లా, తెలంగాణలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరో చోటా ఆయన పేరు ఓటరు జాబితాలో ఉందని ఆధారాలు సమర్పించారు.
కోర్టు ముందున్న ఆధారాలు
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 17, 18 ప్రకారం ఏ పౌరుడైనా ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా ఒకే నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటరుగా నమోదు కాకూడదు. సెక్షన్ 31 ఓటరు జాబితాకు సంబంధించి తప్పుడు డిక్లరేషన్ ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తే, సెక్షన్ 125A తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడానికి వర్తిస్తుంది.
ఫిర్యాదుదారుడు కోర్టుకు ప్రకాష్ రాజ్ 2019 ఎన్నికల అఫిడవిట్లతో పాటు వేలచ్చేరి, శేరిలింగంపల్లి ఓటరు రికార్డులకు సంబంధించిన మొత్తం ఏడు కీలక పత్రాలను సాక్ష్యాలుగా సమర్పించారు. ఈ ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి, 2019 నాటికి ప్రకాష్ రాజ్ పేరు మూడు వేర్వేరు ఓటరు జాబితాలలో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
తాత్కాలిక ఉపశమనం
దీంతో ప్రకాష్ రాజ్పై విచారణ జరపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ కేసును ట్రయల్కు పంపారు. ప్రస్తుతానికి బెయిల్ రావడంతో ప్రకాష్ రాజ్కు తాత్కాలిక ఉపశమనం లభించినట్లయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


