...
...
Next Story

AP New Pensions : ఏపీ ప్రజలకు అలర్ట్ - ఇవాళ్టి నుంచే కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలివే

AP New Pension Scheme Applications :రాష్ట్రంలో కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేటి నుంచి 16 వరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Published on: Sep 7, 2026, 08:01:49 IST
Advertisement

AP New Pension Scheme Applications : ఆంధ్రప్రదేశ్‌లోని నిరుపేదలు, పింఛను కోసం ఎదురుచూస్తున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా పింఛన్లు మంజూరు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు వివిధ కేటగిరీల కింద అర్హత కలిగిన లబ్ధిదారుల నుంచి నేటి (సెప్టెంబర్‌ 7) నుంచి సెప్టెంబర్‌ 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ప్రత్యేకంగా కౌంటర్లు….

ఏపీలో కొత్త పింఛన్లు
ఏపీలో కొత్త పింఛన్లు

గ్రామాలు, పట్టణాల్లోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దీనికోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న అర్హులు ఈ కౌంటర్లలో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అందిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి…. అర్హతలను నిర్ధారిస్తారు. ఆ తర్వాత ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా దశలవారీగా అర్హులందరికీ కొత్త పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది.

పింఛన్ల పంపిణీ సంక్షేమ పథకంలో ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 61,92,396 మంది లబ్ధిదారులకు ప్రతి నెలా పింఛన్లు అందజేస్తున్నారు. ఇందుకోసం నెలకు ఏకంగా రూ.2,694 కోట్ల భారీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కేవలం పింఛన్ల పంపిణీ కోసమే ప్రభుత్వం రూ.73,508 కోట్లు ఖర్చు చేయనుంది.

సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అర్హత ఉండి ఇప్పటివరకు పింఛను అందుకోలేకపోతున్న వారు వెంటనే సమీపంలోని స్వర్ణ గ్రామ లేదా వార్డు కార్యాలయాలను సంప్రదించి…. నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

పింఛన్ల దరఖాస్తు పరిశీలన షెడ్యూల్:

• సెప్టెంబర్ 17 - 21: ప్రాథమిక అర్హతల పరిశీలన నిర్వహిస్తారు.

• సెప్టెంబర్ 22 - 24: క్షేత్రస్థాయిలో భౌతిక, శాఖాపరమైన విచారణ చేపట్టి, అర్హతలను నిర్ణయించి సిఫార్సులు చేస్తారు.

• సెప్టెంబర్ 25 - 26: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించి, ప్రభుత్వ ఆమోదం పొందుతారు.

• స్క్రూటినీ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా పింఛన్లు మంజూరు చేస్తారు.

అప్లికేషన్ ప్రాసెస్ ఇలా…..

అర్హులైన అభ్యర్థులు తమ సంబంధిత స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కేంద్రంలో నిర్ణీత దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఆన్‌లైన్ నమోదు పూర్తయిన వెంటనే దరఖాస్తుదారులకు కంప్యూటర్ జనరేటెడ్ రసీదు ఇస్తారు.

వృద్ధులు, వితంతువులకు నెలకు రూ. 4,000 చొప్పున, దివ్యాంగులకు నెలకు రూ. 6,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయాన్ని మరింత పెంచారు. వ్యాధి తీవ్రతను బట్టి నెలకు రూ. 10,000 వరకు, సంపూర్ణ వైకల్యం ఉన్న కేసుల్లో గరిష్టంగా రూ. 15,000 వరకు పింఛన్ అందిస్తున్నారు.

• వృద్ధాప్య పింఛన్ : వయస్సు ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి.

• వితంతు పింఛన్ : భర్త మరణ ధ్రువీకరణ పత్రం, వితంతువు ఆధార్ కార్డ్.

• ఒంటరి మహిళలు : వివాహమైన వారైతే కోర్టు ద్వారా పొందిన విడాకుల పత్రం, లేదంటే తహశీల్దార్ జారీ చేసిన వివాహం కాలేదనే ధ్రువీకరణ పత్రం.

• దివ్యాంగులు : 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరించే సదరం (SADAREM) సర్టిఫికేట్.

• వృత్తిపరమైన విభాగాలు : చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సాంప్రదాయ పాదరక్షల తయారీదారులు, కల్లు గీత కార్మికులు సంబంధిత శాఖల నుంచి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.

• ట్రాన్స్‌జెండర్లు: జిల్లా మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ అందించాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe