...
...
Next Story

AP Rajya Sabha Elections 2026 : రేసులో యువ నేతలు..! ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ఆ నలుగురు ఎవరు..?

AP Rajya Sabha Elections 2026 : ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి సమయం దగ్గర పడుతుండటంతో కూటమిలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ నుంచి చింతకాయల విజయ్, కిలారు రాజేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా…. జనసేన, బీజేపీ సైతం సీట్లపై కన్నేశాయి.

Published on: Jun 2, 2026, 12:08:30 IST
Advertisement

AP Rajya Sabha Elections 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ సమీపిస్తున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు డిజిటల్ నెట్‌వర్క్‌ను విస్తరించడంలో కీలక పాత్ర పోషించిన నేతలకు ఈసారి పెద్దల సభకు వెళ్లే అవకాశం కల్పించాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం కూటమి విజయం నల్లేరుపై నడకే అయినప్పటికీ…. అభ్యర్థుల ఎంపికలో సరికొత్త వ్యూహాలు కనిపిస్తున్నాయి.

రేసులో యువ నేతలు…!

రాజ్యసభ ఎన్నికలు 2026
రాజ్యసభ ఎన్నికలు 2026

రాజ్యసభ రేసులో అందరికంటే ప్రముఖంగా వినిపిస్తున్న పేరు చింతకాయల విజయ్. ఈయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ డిజిటల్ విభాగాన్ని, సోషల్ మీడియా వ్యూహాలను విజయ్ వెనుకుండి నడిపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అత్యంత ఆప్తుడిగా ఉంటూ…. ఎన్నికల ప్రచార సరళిని, ఆన్‌లైన్ అవుట్‌రీచ్‌ను విజయ్ విజయవంతంగా రూపకల్పన చేశారు. గత కొన్ని ఎన్నికల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ లభించకపోయినప్పటికీ, పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, సంస్థాగత సేవల దృష్ట్యా ఈసారి పెద్దల సభకు పంపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

మరోవైపు నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కిలారు రాజేష్ పేరు కూడా ఈ రేసులో బలంగా వినిపిస్తోంది. తెరవెనుక ఉంటూ పార్టీ రాజకీయ, పరిపాలనా వ్యవహారాలను చక్కదిద్దడంలో రాజేష్ కీలక పాత్ర పోషించారు. పార్టీ అగ్రనాయకత్వంలో ఆయనకు గట్టి మద్దతు ఉందని సమాచారం. సాంప్రదాయ రాజకీయ అనుభవంతో పాటు ఆధునిక కాలానికి అనుగుణంగా పార్టీ పనితీరును ఆధునీకరించిన కొత్త తరం పొలిటికల్ మేనేజర్లకు గుర్తింపు ఇవ్వాలనే యోచనలో భాగంగానే రాజేష్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సాంప్రదాయ రాజకీయ సమీకరణాలతో పాటు పార్టీకి విధేయులుగా ఉంటూ సమర్థతను నిరూపించుకున్న వారికి పదవులు ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు, లోకేష్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జనసేన, బీజేపీ ఆశలు….

మరోవైపు పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు కూడా ఈ అవకాశాన్ని దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భాష్యం రామకృష్ణ, మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్, పార్టీ సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మోహన్ రావు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సనా సతీష్ బాబు మరో విడత అవకాశం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దిల్లీ స్థాయిలో పార్టీ ఉనికిని బలోపేతం చేయడంలో తాను పోషించిన పాత్రను ఆయన అధిష్ఠానం ముందు ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి శాసనసభలో తిరుగులేని బలం ఉండటంతో స్థానాలను గెలుచుకోవడం పెద్ద సమస్య కాదు. నాలుగు స్థానాలు కూడా వారి ఖాతాలోకే వెళ్తాయి. అయినప్పటికీ సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, కూటమి ధర్మం, పార్టీ పట్ల విధేయత వంటి అంశాలను సమతుల్యం చేయడంపైనే చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం జరిగినప్పటికీ… అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe