Rajya Sabha Elections Schedule : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల - ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు
Rajya Sabha Elections Schedule 2026 : దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం (EC)… శుక్రవారం షెడ్యూల్ ప్రకటించింది. ఏపీలో 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Rajya Sabha Elections Schedule 2026 : దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న ఎగువ సభ(రాజ్యసభ) స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 10 రాష్ట్రాల పరిధిలోని మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

పలువురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం జూన్ 21 నుండి జూలై 19 మధ్య వేర్వేరు తేదీల్లో ముగియనుండటంతో…. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ ఈ మేరకు కసరత్తు పూర్తి చేసి షెడ్యూల్ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ సహా పలు కీలక రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఇప్పుడే సందడి మొదలైంది.
ఏపీ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు…
కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం…. మొత్తం 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఈ పోలింగ్ జరగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి అత్యధికంగా నాలుగు చొప్పున స్థానాలు ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి మూడు చొప్పున స్థానాలు, జార్ఖండ్ నుంచి రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంల నుంచి ఒకటో చొప్పున రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. అయితే దాదాపు ఈ స్థానాలన్నీ కూడా కూటమి ఖాతాలోకే వెళ్లే అవకాశం ఉంది. అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వానీ, సాన సతీష్ బాబుల పదవీ కాలం పూర్తి కానుండగా… వీరి స్థానంలో కొత్త వాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ సీట్ల కోసం టీడీపీలోని నేతలే కాకుండా… జనసేన నేతలు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
జూన్ 8 వరకు నామినేషన్ల గడువు
ఈ రాజ్యసభ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక తేదీలను ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 8వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది. అనంతరం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత.. జూన్ 18న ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు ఓట్ల లెక్ఖింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉన్న బలాబలాల ఆధారంగా ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపోటములు ఖరారు కానున్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

