...
...
Next Story

AP RGUKT IIIT Results 2026 : ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశ ఫలితాలు విడుదల - రిజల్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి

AP RGUKT IIIT Results 2026 : ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్‌జీయూకేటీ (RGUKT) ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ ఫలితాలు విడుదలయ్యాయి.ప్రొవిజనల్‌ సెలక్షన్‌ మెరిట్‌ జాబితాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

Published on: Jun 13, 2026, 17:21:28 IST
Advertisement

AP RGUKT IIIT Results 2026 :ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (RGUKT) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రొవిజనల్‌ సెలక్షన్‌ మెరిట్‌ జాబితా అధికారికంగా విడుదలైంది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సోషల్ మీడియా వేదికగా ఈ ఫలితాల వివరాలను వెల్లడించారు.

ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశ ఫలితాలు విడుదల
ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశ ఫలితాలు విడుదల

రాష్ట్రంలోని నూజివీడు, ఒంగోలు, ఆర్‌కే వ్యాలీ (ఇడుపులపాయ), శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ఆరేళ్ల సమీకృత (ఇంటిగ్రేటెడ్) బీటెక్‌ కోర్సులో ప్రవేశాల కోసం ఈ అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం విద్యార్థుల నుంచి భారీ స్థాయిలోనే దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 44,104 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి శనివారం నాడు 4,040 మంది అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేశారు.

ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన మొత్తం విద్యార్థుల్లో ఏకంగా 96.7 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారేనని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల అభ్యర్థులు ప్రతిభ కనబరచడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి చదివి ప్రతిష్టాత్మక ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులందరికీ ఆయన తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు - ఇలా చెక్ చేసుకోండి:

అభ్యర్థులు తమ ప్రొవిజనల్‌ సెలక్షన్‌ వివరాలను ఆర్‌జీయూకేటీ అధికారిక వెబ్‌సైట్‌లోకి ( http://rgukt.in ) వెళ్లి పరిశీలించుకోవచ్చు. వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకునే వీలుంటుంది.

మరోవైపు ఎంపికైన అభ్యర్థులకు కొత్త విద్యా సంవత్సరం తరగతుల నిర్వహణపై ఆర్‌జీయూకేటీ స్పష్టత ఇచ్చింది. ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో కొత్త బ్యాచ్ (పీయూసీ-1) తరగతులు జులై 1 నుంచి ప్రారంభం కానున్నాయి. గత విద్యా సంవత్సరంలో జులై 15 నుంచి తరగతులు మొదలుకాగా, ఈసారి విద్యార్థులకు నష్టం జరగకుండా 15 రోజుల ముందుగానే క్లాసులు స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. కాగా…. క్యాంపస్‌లలో ప్రస్తుతం చదువుతున్న పాత విద్యార్థులకు మాత్రం జూన్‌ 29 నుంచే విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks