ఏపీ టెట్ పరీక్షలు పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాథమిక కీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించిన ఫలితాలను ఈనెల 19వ తేదీన ప్రకటించనున్నారు.
ఏపీ టెట్ - 2025 పరీక్షలు ముగిశాయి. దీంతో అన్ని సబ్జెక్టుల ప్రాథమిక కీలను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించింది. వీటిని పరిశీలించిన తర్వాత తుది కీలను ప్రకటించనుంది. ఫైనల్ కీలను జనవరి 13వ తేదీన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఏపీ టెట్ ఫలితాలు
ఈనెల 19న ఫలితాలు…
మరోవైపు ఏపీ టెట్ ఫలితాలపై కూడా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… ఈనెల 19వ తేదీన టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆ దిశగానే విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
డిసెంబర్ 10వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం, మధ్యాహ్నం సెషన్లవారీగా ఈ ఎగ్జామ్స్ ను నిర్వహించగా… డిసెంబర్ 21వ తేదీతో అన్ని పేపర్లు పూర్తయ్యాయి. ముందుగా కొన్ని పేపర్ల ప్రాథమిక కీలను విడుదల చేయగా… ఆ తర్వాత మిగతా పేపర్ల ప్రాథమిక కీలను కూడా ప్రకటించారు.
ఈసారి జరిగిన ఏపీ టెట్ పరీక్షల కోసం మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో కొందరు పేపర్ 1తో పాటు పేపర్ 2 కు కూడా అప్లయ్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసారి టెట్కు భారీగానే ఇన్ సర్వీస్ టీచర్లు హాజరయ్యారు. విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం… జనవరి 13వ తేదీన ఏపీ టెట్ పరీక్షల ఫైనల్ కీని ప్రకటిస్తారు.జనవరి 19వ తేదీన టెట్ ఫలితాలను వెల్లడిస్తారు.