TTD College Admissions 2026 : శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలలో అడ్మిషన్లు - దరఖాస్తు తేదీలివే

TTD Sculpture College Admissions 2026 : టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. పదో తరగతి పూర్తయిన అభ్యర్థులు జూన్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: May 1, 2026, 18:28:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TTD Sculpture College Admissions 2026 : భారతీయ సనాతన ధర్మాన్ని, అపురూపమైన ఆలయ నిర్మాణ శిల్పకళను భవిష్యత్ తరాలకు అందించడంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో భాగంగా…. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళాశాల 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ సంస్కృతిని, వారసత్వ కళలను వృత్తిగా మార్చుకోవాలనుకునే యువతకు ఇది ఒక సువర్ణావకాశం.

శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాలలో అడ్మిషన్లు
శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాలలో అడ్మిషన్లు

మే 4 నుంచి దరఖాస్తులు…

4 సంవత్సరాల డిప్లొమా కోర్సు, 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సులకు మే 4వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. జూన్ 20వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను కళాశాలలో నేరుగా పొందవచ్చు లేదా టీటీడీ వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 20వ తేదీ సాయంత్రం లోపు అందజేయాలి.

ప్రవేశం పొందిన విద్యార్థుల పేరిట టిటిడి రూ.1 లక్షను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసి, కోర్సు పూర్తి చేసిన తరువాత నిబంధనల ప్రకారం వడ్డీతో సహా అందజేస్తుంది.

1960లో స్థాపించబడిన ఈ శిల్పశిక్షణ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఏకైకంగా నిలిచి, భారతీయ సాంప్రదాయ ఆలయ నిర్మాణం, వాస్తు, శిల్పకళలో నైపుణ్యంతో కూడిన శిల్పులను తీర్చిదిద్దుతోంది. భారతీయ సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో విద్యార్థులను మార్గనిర్దేశం చేస్తోంది.

కోర్సుల వివరాలు:

రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మరియు ఏఐసిటిఈ అనుమతితో నిర్వహించే ఈ కోర్సులో 6 విభాగాలు ఉన్నాయి:

  • ఆలయ నిర్మాణం
  • శిలా శిల్పం
  • సుధా శిల్పం
  • లోహ శిల్పం
  • కొయ్య శిల్పం
  • సంప్రదాయ వర్ణచిత్ర లేఖనం

ప్రతి విభాగంలో సంవత్సరానికి 10 మంది చొప్పున, మొత్తం 60 మందికి ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. చివరి సంవత్సరం విద్యార్థులకు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శన కూడా కల్పిస్తారు.

వస్త్రాలపై సంప్రదాయ చిత్రకళలో శిక్షణనిచ్చే ఈ కోర్సులో ప్రతి సంవత్సరం 10 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఉచిత వసతి, భోజనంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. దేశ విదేశాల్లో కలంకారి కళకు మంచి డిమాండ్ ఉంది.రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు మే 04 నుండి జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ సంస్థలో శిక్షణ పొందిన వారు టీటీడీ ఆలయ నిర్మాణ, పునర్నిర్మాణ విభాగాల్లో స్థపతులు, టెక్నికల్ అసిస్టెంట్లు, కాంట్రాక్టర్లు దేవాదాయ, పర్యాటక, పురావస్తు శాఖల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. అంతేకాక, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకుంటున్నారు.

ఇతర వివరాలకు శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ,తిరుమల తిరుపతి దేవస్థానములు, అలిపిరి రోడ్, తిరుపతి – 517507ను సంప్రదించవచ్చు. లేదా www.tirumala.org వెబ్ సైట్ లేదా 0877-2264637 నెంబర్ కు కాల్ చేయవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More