రాష్ట్రంలోని 10 గురుకుల జూనియర్ కళాశాలల్లో(APRJC 2026) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఏప్రిల్ 7వ తేదీతో పూర్తి కానుంది. అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. అంతేకాకుండా సీట్లు పొందే వారికి ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.
దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 24వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో చేరవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,425 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి.
దరఖాస్తు విధానం ఇలా:
- ముందుగా https://aprs.apcfss.in/dashboard వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని APRJC 2026 లింక్ పై క్లిక్ చేయాలి.
- పేమెంట్ ఆప్షన్ పై నొక్కి ఫీజును చెల్లించాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. విద్యార్థి వివరాలను నమోదు చేయాలి
- చివరగా సబ్మిట్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
- రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 15వ తేదీ జారీ అవుతాయి. ఏప్రిల్ 24వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు. మే 15వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో విద్యార్థులు సాధించిన మార్కులు, రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీ, స్థానికత ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. కౌన్సెలింగ్ ప్రాసెస్ ద్వారా సీట్లను భర్తీ చేస్తారు.