పీపీపీ మోడల్లో ఆరు బస్ స్టేషన్లను అభివృద్ధి చేయాలనుకుంటున్న ఏపీఎస్ఆర్టీసీ!
ఏపీఎస్ఆర్టీసీ పీపీపీ మోడల్లో పలు బస్ స్టేషన్లను అభివృద్ధి చేయాలని ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని పలువురు వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు సమర్థిస్తున్నారు.
ప్రయాణికులకు మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రధాన బస్ స్టేషన్లను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) మోడల్ కింద అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నట్టుగా సమాచారం. మూడు నుండి ఐదు దశాబ్దాల వరకు ప్రభుత్వ ఆస్తులను పీపీపీ కింద ఇవ్వడం వల్ల కార్పొరేషన్ కూలిపోతుందని, ఆదాయం సంపాదించడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని, ఇబ్బందులు వస్తాయని ఉద్యోగులు అంటున్నారు.

ఈ పీపీపీ మోడల్ ప్రతిపాదిత ప్రాజెక్టులలో విజయవాడలోని ఆటోనగర్, కర్నూలులోని రాజ్విహార్, గుంటూరు, కడపలోని ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్స్, తిరుపతిలో ఆధునిక ఇంటర్మోడల్ స్టేషన్ నిర్మాణం, చిత్తూరులో బస్ స్టేషన్-కమ్-కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. ఆరు ప్రాజెక్టుల మొత్తం అంచనా పెట్టుబడి రూ.958 కోట్లుగా ఉంది.
ఆరు ప్రాజెక్టులలో విజయవాడలోని ఆటోనగర్ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ రూ. 154 కోట్ల అంచనా వ్యయంతో బిడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. రూ. 495 కోట్లతో నిర్ణయించిన తిరుపతి ఇంటర్మోడల్ స్టేషన్ వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పూర్తి చేసింది. మిగిలిన నాలుగు ప్రాజెక్టులు ఇంకా డీపీఆర్ తయారీ దశలోనే ఉన్నాయి.
ఈ ఆరు ప్రాజెక్టులను డిజైన్ ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్, బీఓటీ విత్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, బీఓటీ విత్ రెవెన్యూ షేరింగ్ మెకానిజమ్స్ వంటి విభిన్న పీపీపీ ఫార్మాట్ల కింద ప్లాన్ చేశారు. పీపీపీ మోడల్ కార్పొరేషన్ను పణంగా పెట్టి ప్రైవేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్ల పునర్నిర్మాణానికి కార్పొరేషన్కు నేరుగా నిధులు ఇవ్వాలని యూనియన్లు కోరుతున్నాయి.
ఏపీఎస్ఆర్టీసీ తన ఆస్తులను స్వతంత్రంగా అభివృద్ధి చేయగలదని, నిర్వహించగలదని చెబుతున్నారు. వాణిజ్యపరంగా విలువైన బస్ స్టేషన్ భూమి, సముదాయాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం కారణంగా ఏపీఎస్ఆర్టీసీ దీర్ఘకాలిక ఆర్థిక స్థితి బలహీనపడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన మౌలిక సదుపాయాలపై దాని నియంత్రణ తగ్గుతుందని యూనియన్లు హెచ్చరిస్తున్నాయి.
విజయవాడ బస్టాండ్ పునరుద్ధరణ తర్వాత వాణిజ్య ఆదాయం పెరిగిందని, ఇది నేరుగా కార్పొరేషన్కు వెళుతోంది. పీపీపీ మోడల్తో డబ్బు ప్రైవేట్ కంపెనీలకు వెళుతుందని, ఆర్టీసీకి కొద్దిపాటి వాటా చెల్లిస్తారని పలువురు చెబుతున్నారు. రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా పెట్టుబడులను సమీకరించడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, వాణిజ్య సౌకర్యాలను ఏకీకృతం చేయడం పీపీపీ మోడల్ లక్ష్యంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
మరోవైపు పీపీపీ మోడల్ ద్వారా ఆధునీకరణతోపాటుగా సౌకర్యాలు పెద్ద ఎత్తులో అందుబాటులోకి వస్తాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి నిధులు పెద్ద ఎత్తున సమకూరుతాయని చెబుతున్నారు. దీనిపై ఆర్టీసీ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

E-Paper












