అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్.. ఇటువైపు వెళ్లేవారు తప్పక చదవాలి!
విజయవాడ వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వచ్చింది. దీంతో గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనదారులు విజయవాడలోకి వెళ్లకుండానే ఏలూరు, గుంటూరు వెళ్లవచ్చు.
సంక్రాంతిని సందర్భంగా విజయవాడ వెస్ట్ బైపాస్ను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలంలోని కాజా నుంచి కృష్ణా జిల్లాలోని పెదఅవుటపల్లికి వరకు నిర్మించిన విజయవాడ పశ్చిమ బైపాస్ను నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు ప్రారంభించారు. కొత్తగా పూర్తయిన రహదారిని ఒక వైపు ప్రారంభించారు.

ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు పూజలు నిర్వహించారు. మెుదట NHAI అధికారుల వాహనాలు మాత్రమే బైపాస్ మీద నుంచి పంపించారు. ఆ తర్వాత ఇతర వాహనాలు కూడా అనుమతించారు.
మార్చి నాటికి మరోవైపు కూడా మార్గాన్ని తెరుస్తామని అధికారులు ప్రకటించారు. గుంటూరు వైపు నుండి వచ్చే వాహనాలు నేరుగా రాజధానికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు కూడా ధృవీకరించారు. మొత్తం రోడ్డు పూర్తిగా పనిచేసిన తర్వాతే వెంకటపాలెం వద్ద టోల్ ఫీజులు వసూలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
చెన్నై, గుంటూరు వెపు నుంచి వస్తున్న వాహనాలు కాజా టోల్గేట్ దాటాక వెస్ట్ బైపాస్లోకి రావాలి. గొల్లపూడి మీదుగా చిన్నఅవుటపల్లి దాకా వెళ్లాలి. అక్కడ ఏలూరువైపు జాతీయ రహదారిలోకి చేరుకుని వెళ్లవచ్చు. కాజా టోల్గేట్ నుంచి వచ్చే వాహనాలు ఏలూరువైపుగా నేరుగా వెళ్లవచ్చు. మరో విషయం ఏంటంటే.. గుంటూరు నుంచి వచ్చే వాహనాలు.. ఈ బైపాస్లో గొల్లపూడి దగ్గర విజయవాడ-హైదరాబాద్ హైవేలోకి చేరుకోవచ్చు. అలా హైదరాబాద్ వైపునకు వెళ్లవచ్చు. ఇలా చేస్తే.. గుంటూరు నుంచి వచ్చే వెహికల్స్ విజయవాడ సిటీలోకి ఎంట్రీ అవ్వకుండానే ఏలూరు, హైదరాబాద్కు వెళ్లవచ్చు.
వెస్ట్ బైపాస్లో గొల్లపూడి వైపు నుంచి వచ్చే వాహనాలకు ప్రస్తుతం కాజా వరకు రావడానికి అవకాశం లేదు. ఈ మేరకు వివరాలను నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు తెలిపారు. ఎందుకంటే మధ్యలో కొన్ని ప్రదేశాల్లో పనులు నిర్వహిస్తున్నారు. గొల్లపూడి నుంచి వచ్చేటప్పుడు కృష్ణా నది మీద వంతెన, సీడ్ యాక్సెస్ రోడ్డు దాటినాక మంగళగిరి-మందడం రోడ్డులోకి చేరుకోవచ్చు. సచివాలయం, హైకోర్టు వైపు వెళ్లవచ్చు. వెంకటపాలెం దగ్గర టోల్ ఫీజులు రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతనే వసూలు చేయనున్నారు.

E-Paper












