గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్య ఘటనను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'చంద్రబాబు గారూ మీరు పాలించడానికి అర్హులేనా? రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలితీసుకుంటారు?' అని ప్రశ్నించారు.
ఇన్ని అరాచకాలకు పాల్పడతారా..? వైఎస్ జగన్

ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ కక్షల పాలన ఫలితంగా ఒక పేదవాడు అయిన మందా సాల్మన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారు? అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్యచేస్తారా? పైగా సాల్మన్పైనే తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా? ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది..?” అని జగన్ ప్రశ్నించారు.
"ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీరు అజమాయిషీ చెలాయిస్తున్నారు. ఊళ్లో మీకు గిట్టని వారు ఉంటే చంపేస్తామని మీ వాళ్లు, మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందలకొద్దీ వైయస్సార్ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు… అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు ఇలాంటి ఎన్నో ఘటనలు పల్నాడు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సిగ్గులేకుండా మారణకాండను ప్రోత్సహించారు"అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.
పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా..? అని వైఎస్ జగన్ నిలదీశారు. “అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్షలకోసం శాంతిభద్రతలను దెబ్బతీసి హత్యారాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా…? మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా..? చంద్రబాబుగారూ… హింసారాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. తప్పకుండా ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏది విత్తుతారో అదే రేపు పండుతుందన్నది ఎప్పుడూ మరిచిపోకూడదు. టీడీపీవారి చేతిలో హత్యకు గురైన సాల్మన్ కుటుంబానికి వైయస్సార్సీపీ అండగా ఉంటూ వారిని ఆదుకుంటుంది” అని జగన్ చెప్పారు.