Tirumala Srivari Donation : కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తులు తమ భక్తిని చాటుకుంటూ భారీ విరాళాలు సమర్పిస్తుంటారు. తాజాగా తిరుమల శ్రీవారికి మరో భక్తురాలు భక్తితో ఖరీదైన కానుకను అందజేశారు.బెంగళూరుకు చెందిన డాక్టర్ ఎం మహాదేవమ్మ 753 గ్రాముల బరువున్న ఏడు బంగారు పతకాలను తిరుమల శ్రీవారికి కానుకగా అందజేశారు.
7 బంగారు పతకాలు…

సుమారు 753 గ్రాముల బరువున్న 7 బంగారు పతకాలను ఆమె… తిరుమల శ్రీవారికి విరాళంగా ఇచ్చారు. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.94.80 లక్షలు ఉంటుందని అంచనా.
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన కార్యక్రమంలో దాత డాక్టర్ ఎం మహాదేవమ్మ…. ఈ బంగారు పతకాలను టీటీడీ ఉన్నతాధికారులకు అందజేశారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలు ఈ విరాళాన్ని స్వీకరించారు. స్వామివారి పట్ల తనకున్న అపారమైన భక్తితో ఈ కానుకను సమర్పించినట్లు దాత ఈ సందర్భంగా పేర్కొన్నారు.
విరాళం స్వీకరించిన అనంతరం అధికారులు దాతకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి, వేద ఆశీర్వచనం చేయించారు. తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్యతో పాటు,…స్వామివారికి అందుతున్న విరాళాల తాకిడి కూడా నిరంతరం పెరుగుతూనే ఉంది. ఈ బంగారు పతకాలను స్వామివారి అలంకరణలో లేదా టీటీడీ నిబంధనల మేరకు వినియోగించనున్నారు.
బంగారుపతకాలను సమర్పించే సమయంలో డాక్టర్ మహాదేవమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. తాను సంపాదించిన సంపదలో కొంత భాగాన్ని తిరిగి ఆ ఏడుకొండల వాడికే అర్పించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా… అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.