బెంగళూరు టెకీ దారుణ హత్య: ఆంధ్రాలో హ్యామర్తో చంపి పూడ్చిపెట్టిన కజిన్
బెంగళూరులో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనాథ్ కే. అదృశ్యం కేసు విషాదాంతమైంది. అక్టోబర్ చివరిలో కనిపించకుండా పోయిన 34 ఏళ్ల శ్రీనాథ్ మృతదేహం ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఓ నిర్మానుష్య భవనంలో పూడ్చిపెట్టిన స్థితిలో లభ్యమైంది. ఆర్థిక వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు.
అక్టోబరు చివరిలో బెంగళూరులో అదృశ్యమైన టెక్ ప్రొఫెషనల్ శ్రీనాథ్ కే. కేసు చివరకు అత్యంత దారుణంగా ముగిసింది. కర్ణాటకకు సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆయన మృతదేహం లభ్యమైంది.

అత్తిబెలేలో నివాసం ఉంటున్న 34 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనాథ్ కే. అక్టోబర్ 27న అదృశ్యమయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఒక నిర్మానుష్య భవనంలో పూడ్చిపెట్టిన ఆయన మృతదేహాన్ని నవంబర్ 16న పోలీసులు వెలికితీశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, శ్రీనాథ్ను అతడి కజిన్, 39 ఏళ్ల ప్రభాకర్ హత్య చేసినట్లు తెలుస్తోంది. కుప్పంలో నివాసం ఉంటున్న ప్రభాకర్పై ఇప్పటికే నేరారోపణలు ఉన్నాయి. ప్రభాకర్తో పాటు అతడి అనుచరుడు, 35 ఏళ్ల జగదీష్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. జగదీష్ కూడా 'హిస్టరీ షీటర్' అని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.
ఆర్థిక వివాదమే హత్యకు కారణం
శ్రీనాథ్, ఆయన భార్య నేహా ఎంపీ, వారి బిడ్డతో కలిసి బెంగళూరు, నేరలూరులోని స్మైలీ సెలెస్టియల్ లేఅవుట్లో నివాసం ఉండేవారు. శ్రీనాథ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో, నవంబర్ 1న నేహా అత్తిబెలే పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.
శ్రీనాథ్ అదృశ్యమైన రోజున కుప్పంలోని ప్రభాకర్ను కలవడానికి వెళ్లారని, ఈ ఘటన వెనుక ప్రభాకర్ హస్తం ఉందని నేహా విచారణ అధికారులకు చెప్పారు.
పోలీసుల దర్యాప్తులో తేలిన విషయం ఏమిటంటే, ఈ ఇద్దరు కజిన్స్ ఇటీవల ఒక వ్యాపార లావాదేవీల గురించి చర్చించుకున్నారు. ప్రభాకర్ గతంలో శ్రీనాథ్ గృహప్రవేశానికి హాజరయ్యాడు. ఆ సమయంలో, డబ్బును రెట్టింపు చేస్తానని నమ్మబలికి శ్రీనాథ్ను ₹40 లక్షలు పెట్టుబడి పెట్టమని ఒప్పించాడు. శ్రీనాథ్ ఆ మొత్తాన్ని అప్పు చేసి ప్రభాకర్కు ఇచ్చినట్లు సమాచారం.
అనుమానం.. అరెస్ట్.. నేరం ఒప్పుకోలు
మొదట ప్రశ్నించినప్పుడు, ప్రభాకర్ శ్రీనాథ్ను కలవలేదని ఖండించారు. తాను వేరే బంధువుతో బెంగళూరులోనే ఉన్నానని చెప్పి, దానికి మద్దతుగా కొన్ని ఆధారాలు కూడా చూపించాడు. దీంతో పోలీసులు మొదట్లో అతన్ని పక్కన పెట్టారు.
అయితే, తన భర్త ప్రభాకర్కు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేశారని నేహా పదేపదే పోలీసులకు చెప్పారు. ఈ ఆరోపణల మేరకు సీనియర్ అధికారులు అత్తిబెలే పోలీసులను కేసును మళ్లీ పరిశీలించాలని ఆదేశించారు. నవంబర్ 13న మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా మార్చి, ప్రభాకర్ను కస్టడీలోకి తీసుకున్నారు.
సుదీర్ఘ విచారణ సమయంలో, ప్రభాకర్ ఆకస్మాత్తుగా నేరాన్ని నేహా వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు. శ్రీనాథ్ను తానే చంపినట్లు నేహాపై ఆరోపణలు చేశాడు. అప్పటి వరకు హత్య కోణం గురించి పోలీసులు చర్చించనప్పటికీ, నేహాపై నింద వేయడంతో పోలీసులకు వెంటనే అనుమానం పెరిగింది.
నిలకడగా విచారించగా, ప్రభాకర్ చివరకు నేరాన్ని అంగీకరించాడు. అతను శ్రీనాథ్ను కుప్పంలోని ఒక ప్రభుత్వ హౌసింగ్ కాలనీకి రప్పించి, అక్కడ హ్యామర్తో దాడి చేసి చంపాడని చెప్పాడు. ఆ తర్వాత జగదీష్ సహాయంతో దగ్గరలోని నిర్మానుష్య భవనంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు తెలిపాడు.
శ్రీనాథ్ నుంచి తనకు ₹10 లక్షలు మాత్రమే వచ్చాయని, అందులో ₹5 లక్షలు తిరిగి ఇచ్చేశానని ప్రభాకర్ చెప్పాడు. మిగిలిన డబ్బు కోసం శ్రీనాథ్ పదేపదే డిమాండ్ చేయడంతో, అతన్ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఈ కేసులో మరింత దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


